తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు కోత.. ఇచ్చేది రూ.13 వేలే, కారణం ఏంటో చెప్పిన ప్రభుత్వం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది.. అందుకే ఇవాళ సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన నిధుల్ని విడుదల చేస్తోంది. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు జమ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున సాయం అంజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం అమలుకు సంబంధించి విడుదల చేసిన జీవోలో మాత్రం రూ.15వేలు కాకుండా రూ.13వేలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. మిగిలిన రెండు వేల రూపాయల్ని పాఠశాలల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే అకౌంట్‌లకు జమ చేస్తారని తెలిపింది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో కూడా అమ్మ ఒడి కింద రూ.15వేలు అందజేశారు. అప్పుడు కూడా ఈ రూ.15వేలలో పాఠశాల నిర్వహణ కోసం రూ.వెయ్యి, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000, చొప్పున మినహాయించి మిగిలిన రూ.13వేలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అయ్యింది.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున ఇవ్వబోతోంది. సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు. పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు లోపు ఆదాయం ఉన్నవాళ్లే ఈ పథకానికి అర్హులు.. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు రేషన్ కార్డులో కచ్చితంగా ఉండాలి. మాగాణి మూడు ఎకరాలలోపు, మెట్ట 10 ఎకరాలలోపు.. రెండు కలిపి 10 ఎకరాలులోపు ఉన్నవాళ్లే అర్హులు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.. ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే నెలకు విద్యుత్ వాడకం 300 యూనిట్లు మించకూడదు.. పట్టణాలు, నగరాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు.. పింఛన్‌ (రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి) తీసుకునేవారు అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో 12వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలులోపు ఆదాయం ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. ఐటీ (ఇన్‌కమ్ టాక్స్) ఫైల్ చేసేవారికి ఈ పథకం వర్తించదు. మరోవైపు తపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. నిధుల కొరత రాకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు ఒకవేళ సాంకేతిక సమస్యల కారణంగా ఎవరి పేర్లు అయినా రాకపోతే.. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. తల్లికి వందన పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 'విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం' అన్నారు. అలాగే నేటి నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఆడుతూ, పాడుతూ చదువుకునేందుకు అద్భుతమైన వాతావరణం. ఆకలి వేసే మధ్యాహ్నానికి 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం' ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం. విద్యా సంవత్సరం బడి గంట మోగేసరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ సరికొత్త యూనిఫామ్, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగు అందజేస్తున్నాం. తల్లికి వందనం పథకం ఆరంభిస్తున్నాం. సమస్యలు పరిష్కరించాం.. సంస్కరణలు ఆరంభించాం.. బాలలే మన ప్రపంచం.. వారి చదువే మనకు గీటురాయి.. ఉపాధ్యాయులే మనకు దిక్సూచి.. పిల్లల బంగారు భవితకు బాటలు వేద్దాం.‌ విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది, అధికారులు, విద్యాశాఖ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.