రూ.18 కోట్లతో రైల్వే ఓవర్‌బ్రిడ్జి.. "L" ఆకారంలో వంతెన నిర్మించడంపై తీవ్ర దుమారం

Wait 5 sec.

రాజధాని భోపాల్‌లో నిర్మించిన ఒక రైల్వే బ్రిడ్జి ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది. నగరంలోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఆ (ఆర్వోబీ)ని 90 డిగ్రీల మలుపుతో వినూత్నంగా నిర్మించారు. అయితే 2 ఏళ్ల క్రితం ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించగా.. త్వరలోనే పూర్తి కానుంది. అయితే ఈ ఆర్వోబీ ఇంకా ప్రారంభం కాకముందే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ రైల్వే బ్రిడ్జిపై ప్రయాణం చేస్తే.. ప్రమాదాలు జరుగుతాయని స్థానికంగా ఉంటున్న వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న స్థలం కొరత.. దగ్గర్లోనే మెట్రో స్టేషన్ ఉండటం వల్ల.. ఆ బ్రిడ్జిని అలాగే నిర్మించాల్సి వచ్చిందని.. దానికి వేరే మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. రూ.18 కోట్ల వ్యయంతో 648 మీటర్ల పొడవు.. 8.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి చిన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ బ్రిడ్జి మధ్యలో ఒక ప్రాంతంలో 90 డిగ్రీల కోణంతో మలుపు నిర్మించడమే తాజా వివాదానికి కారణం అయింది. ఈ రైల్వై పైవంతెన నిర్మాణం 2023 మార్చి నెలలో ప్రారంభమైంది. ఇక ఆ బ్రిడ్జి నిర్మాణానికి స్థలం కొరత ఉందని.. దానికి సమీపంలోనే మెట్రో రైలు స్టేషన్ ఉండటం వల్ల ఈ విధంగా నిర్మించడం తప్ప వేరే మార్గం లేదని దానికి సంబంధించిన అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆర్వోబీ దాదాపు పనులు పూర్తి చేసుకుని.. ప్రారంభోత్సవం జరుపుకునేందుకు సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిని మహామాయి కా బాగ్, పుష్ప నగర్, స్టేషన్ ప్రాంతం నుంచి న్యూ భోపాల్‌కు ప్రజల రాకపోకలను సులభతరం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచించి నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐష్‌బాగ్ ప్రాంత ప్రజలు రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదని.. అధికారులు వెల్లడించారు. ఇలా రైల్వే క్రాసింగ్ తప్పించుకునేందుకు.. చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆర్వోబీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిత్యం సుమారు 3 లక్షల మంది ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన కారణంగా.. దానిపై స్థానికులు మాత్రమే కాకుండా ఆ బ్రిడ్జి ఫోటో చూసిన నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో.. అసలు ఆ ఆర్వోబీ డిజైన్‌పై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ రకంగా ఒకే చోట 90 డిగ్రీల కోణంలో మలుపు ఉండటం వల్ల వాహనాలు తిరగడానికి కష్టమై.. నిత్యం ప్రమాదాలకు కారణం అవుతుందని వారు చెబుతున్నారు.అయితే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజనీర్ వీడీ వర్మ.. ఈ బ్రిడ్జి వివాదంపై మీడియాతో మాట్లాడారు. మెట్రో స్టేషన్ కారణంగా ఆ ప్రదేశంలో స్థలం చాలా తక్కువగా ఉందని.. స్థలం లేకపోవడం వల్ల వేరే మార్గం లేక ఇలా నిర్మించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆర్వోబీ నిర్మించడానికి ప్రధాన ఉద్దేశ్యం.. రైల్వే ట్రాక్‌కు ఇరు వైపుల ఉన్న రెండు ప్రాంతాలను కనెక్ట్ చేయడమేనని తేల్చి చెప్పారు. అయితే ఈ రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై చిన్న వాహనాలు మాత్రమే నడుస్తాయని.. భారీ వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.