తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. నేటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో , కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు (మంగళవారం) ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. రేపు (బుధవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వానలు పడతాయన్నారు. గురువారం (జూన్ 19) ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.గత 24 గంటల్లో మహబూబాబాద్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించటం, ఖరీఫ్ సాగు పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. రైతులు సాగుకు సిద్ధం కావాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున, పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద, ఆరు బయట ఉండొద్దని సూచించారు.