వైఎస్ జగన్‌కు షాకిచ్చిన పోలీసులు.. అలా కుదరదని తేల్చి చెప్పారు, కండిషన్స్ అప్లై

Wait 5 sec.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు జిల్లా పోలీసుల్ని అనుమతి కోరారు.. అయితే భారీగా జనం వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు విధంగా అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే రావాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎస్పీ శ్రీనివాసరావుకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలను వివరించారు. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వస్తున్నారని, ఆయన పర్యటన కోసం సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి అనుమతి కోరారన్నారు. అయితే, కార్యక్రమానికి ఎంత మంది వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వారికి కావలసిన ఏర్పాట్లు ఏమిటి అనే పూర్తి వివరాలను గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి తమకు ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. సుమారు 30 వేల మంది వస్తారని తమకు తెలిసిందని.. అంత మంది ఒకేసారి వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని.. అందుకే అనుమతి ఇవ్వలేదన్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి అనుమతిపై పరిశీలిస్తామని.. పోలీసుల అనుమతి తీసుకోకుండా ఈ కార్యక్రమం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని.. సెక్యూరిటీ కాన్వాయ్‌తో పాటు మరో మూడు వాహనాలు, వంద మంది విగ్రహావిష్కరణకు వస్తే తమకు అభ్యంతరం లేదన్నారు ఎస్పీ శ్రీనివాసరావు. వైఎస్సార్‌సీపీ నేతలు కోరిన విధంగా అనుమతి ఇవ్వలేమన్నారు. వైఎస్సార్‌సీపీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే వీధి చాలా ఇరుకుగా ఉంటుందని.. అప్పుడు జనాలు భారీగా వస్తే బందోబస్తు రీత్యా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు ఎస్పీ. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయాలనుకుంటే గ్రామ శివారులో నిర్వహించుకోవాలని సూచించామన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని లేఖ రాసి ఇస్తేనే అనుమతిస్తామన్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే వారం రోజుల ముందు అనుమతులు తీసుకోవాలని.. అప్పుడే సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల రీత్యా.. సాధ్యమైనంత వరకు పరిమిత సంఖ్యలోనే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నాము అన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించడంపై వైఎస్సార్‌సీపీ స్పందించాల్సి ఉంది.. మరి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారా, పోలీసుల సూచనల ప్రకారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి.