అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌ సమీపంలో గ్యాట్విక్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు రమేశ్ విశ్వాస్ కుమార్ (38)గా గుర్తించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ‘తన ప్రకటన తప్పుగా ఉటంకించారు. ఒక వ్యక్తి సజీవంగా బయటపడ్డాడు... అతడి పరిస్థితి విషమంగా ఉంది.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు... వైద్యులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు’ అని అన్నారు.ప్రస్తుతం అహ్మదాబాద్‌ అసర్వాలోని సివిల్ హాస్పిటల్‌లో రమేశ్ చికిత్స పొందుతున్నాడు. ఛాతీ, కళ్లు, పాదాలకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. భారత్‌లోని తన కుటుంబ సభ్యులను చూసేందుకు వచ్చిన విశ్వాస్ కుమార్.. తన సోదరుడు అజయ్ కుమార్ రమేశ్‌తో కలిసి తిరిగి యూకేకు వెళుతున్నాడు. అజయ్ కుమార్ రమేశ్ పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది.హిందుస్థాన్ టైమ్స్‌తో విశ్వాశ్ మాట్టాడుతూ.. టేకాఫ్ అయిన తర్వాత జరిగిన భయానక క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ‘టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత, పెద్ద శబ్దం వచ్చింది, ఆపై విమానం కూలిపోయింది. అదంతా క్షణాల్లో జరిగిపోయింది’ అని చెప్పాడు.ఎయిరిండియా విమానం AI- 171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ 242 మందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయ్యింది. లండన్ గ్యాట్విక్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ఇది కూలిపోయింది. విమానంలో ఇంధనం అధికంగా నింపి ఉండటంతో కూలిపోయిన తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. సమీపంలోని వైద్య కళాశాలకు చెందిన హాస్టల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హాస్టల్‌లోని మెడికోలు మరణించారు. మరో 50 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.ఈ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. "మాటల్లో చెప్పలేని హృదయ విదారకంగా అభివర్ణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పౌర విమానయాన, అత్యవసర అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని అని అన్నారు. ప్రధాని మోదీ బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.