: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అన్నీ కాలి బూడిద కాగా.. ఓ భగవద్గీత పుస్తకం మాత్రం చెక్కుచెదరకుండా దొరికింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భగవద్గీత ఎవరిదో ఇప్పుడు వివరాలు తెలిశాయి. ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న మైథిలీ పాటిల్‌దే ఆ భగవద్గీత అని భావిస్తున్నారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా పన్వేల్ తాలూకా న్హవా గ్రామానికి చెందిన మైథిలీ పాటిల్ ఎన్నో కష్టాలు పడి ఈ రంగంలోకి వచ్చారు. శ్రీకృష్ణుడంటే ఆమెకు అమితమైన భక్తిభావం. విమానంలో తనతో పాటు ఎప్పుడూ కృష్ణుడి విగ్రహం, భగవద్గీత తీసుకెళ్లేవారు. ప్రయాణంలో శ్లోకాలు పఠించేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో 22 ఏళ్ల మైథిలి మోరేశ్వర్ పాటిల్ కూడా మరణించారు. మైథిలి చాలా కష్టాలను ఎదుర్కొంటూ తన చదువును పూర్తి చేసిందని ఆమె తండ్రి మోరేశ్వర్ పాటిల్ చెప్పారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోయినప్పటికీ.. సాధారణ పరిస్థితులలో చదువు పూర్తి చేసి, ఆపై ఎయిర్ ఇండియాలో పనిచేయడం ప్రారంభించింది. మైథిలి పాటిల్ తండ్రి మోరేశ్వర్.. పన్వేల్ సమీపంలోని ONGCలో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి ఎయిర్ హోస్టెస్ అయిన మైథిలీ.. హఠాత్తుగా చనిపోవడంతో ఆమె కుటుంబం సహా గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా విమానం కూలిపోయి అందులో చెలరేగిన మంటల వల్ల పూర్తి స్థాయిలో మృతదేహాలు ధ్వంసం అయ్యాయి. అలాగే విమాన శిథిలాలు కూడా కాలి బూడిదయ్యాయి. అయితే, ఓ లభ్యం కావడం అందరినీ ఆశ్చర్య పరిచంది. విమాన ప్రమాదం తర్వాత 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడినప్పటికీ భగవద్గీత పుస్తకం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ భగవద్గీత పుస్తకం మైథిలీదే అయుంటుందని ఆమె తల్లిదండ్రులు సహా గ్రామస్థులందరూ భావిస్తున్నారు. ఆమె శ్రీకృష్ణుడికి గొప్ప భక్తురాలని చెబుతున్నారు. ఇస్కాన్ పూజారి ఆమెకు తులసి మాల ఇచ్చారట. ఆ మాలతో పాటు శ్రీకృష్ణుడి విగ్రహం, భగవద్గీత పుస్తకాన్ని ఎప్పుడూ ఆమె తనతోనే ఉంచుకునేదని తల్లిదండ్రులు మరాఠీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.మైథిలి నిత్యం శ్లోకాలు జపిస్తూ.. శ్రీకృష్ణుడిని తలుచుకునేదని ఆమె తండ్రి చెప్పారు. గత రెండేళ్లుగా ఆమె .. వీలు దొరికినప్పుడల్లా భజనలు చేస్తూ పాటలు పాడేదని, ఆలయాలకు వెళ్లేదని తెలిపారు. తన జీతంలో కొంత భాగం కృష్ణుడి ఆలయం కోసం ఇచ్చేదని, కొంత భాగం ఆధ్యాత్మిక యాత్రల కోసం కేటాయించేదని చెప్పారు. అంతటి కృష్ణ భక్తురాలు అయిన తమ కుమార్తె .. ఆమె భగవద్గీత పుస్తకం మాత్రం చెక్కు చెదరకుండా దొరకిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ కృష్ణ పరమాత్ముడే తన కుమార్తెను కాపాడితే బాగుండని అంటున్నారు. ఘటనా స్థలంలో లభించిన భగవద్గీత పుస్తకం, కృష్ణ విగ్రహం తమకు అప్పగించాలని, వాటిని తమ కుమార్తె గుర్తులుగా దాచుకుంటామని కోరుతున్నారు.రెండు నెలల కిందటే పాఠశాలకు..మైథిలి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డైసీ పాల్.. ఆమెను గుర్తుచేసుకున్నారు. ఆమె చాలా ప్రశాంతంగా, క్రమశిక్షణతో ఉండేదని తెలిపారు. ఆమె తెలివైన విద్యార్థి అని చెప్పారు. ఎప్పుడూ సంతోషంగా ఉండేదని, తోటి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేవిధంగా చదివేదని గుర్తుచేశారు. ‘రెండు నెలల క్రితం పాఠశాల పూర్వ విద్యార్థులను సమ్మేళనం జరిగింది. అప్పుడు ఆమె (మైథిలి) పాఠశాలకు వచ్చింది. విమానయాన రంగంలో కెరీర్ అవకాశాల గురించి చెప్పింది. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసింది’ అని పాల్ చెప్పుకొచ్చారు.