తెలంగాణలో తగ్గుతున్న అమ్మాయిలు.. 1000 మంది బాలురు.. 907 మందే బాలికలు

Wait 5 sec.

తెలంగాణలో ఆందోళనకరంగా మారింది. బాలురతో పోలిస్తే బాలికల జననాలు తక్కువగా ఉంటున్నాయి. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా.. 2022లో ప్రతి వెయ్యి మంది బాలురకు కేవలం 907 మంది బాలికలు మాత్రమే జన్మించారు. ఈ గణాంకాల ప్రకారం.. జాబితాలో తెలంగాణ దేశంలోనే దిగువ నుంచి మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ కంటే దిగువన కేవలం బిహార్ (891), మహారాష్ట్ర (906) మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిష్పత్తి 938గా నమోదైంది. ఈ వివరాలను కేంద్ర జనాభా లెక్కల విభాగం విడుదల చేసిన 2022 జనన, మరణాల నివేదిక స్పష్టం చేసింది.2022లో దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది బాలురకు సుమారు 910 మంది బాలికలు జన్మించారు. ఈ జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ సగటు (907) తక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం జననాల్లో బాలురు 1.33 కోట్లు (52.4%), బాలికలు 1.21 కోట్లు (47.6%) ఉన్నారు. 2022లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బాలురు కంటే బాలికల జననాలు ఎక్కువగా ఉన్నవి మూడు మాత్రమే. నాగాలాండ్‌లో ప్రతి వెయ్యి మంది బాలురకు 1,068 మంది బాలికలు జన్మించగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో 1,036, లద్దాఖ్‌లో 1,027 మంది బాలికలు జన్మించారు.దేశవ్యాప్తంగా 2021తో పోలిస్తే 2022లో మరణాలు 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గాయి. అయితే, తెలంగాణతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం అంతకు ముందు సంవత్సరం కంటే మరణాలు పెరిగాయి. తెలంగాణలో మరణాలు పట్టణాల్లో 59.8%, గ్రామీణంలో 40.2% నమోదయ్యాయి.దేశవ్యాప్తంగా జననాలు 2.42 కోట్ల నుంచి 2.54 కోట్లకు పెరిగాయి. నికరంగా దేశ జనాభా 1.67 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో (43.5%) కంటే పట్టణ ప్రాంతాల్లో (56.5%) జననాలు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో నమోదైన జననాల్లో 71.9 శాతం పట్టణాల్లో ఉండగా.. గ్రామీణంలో 28.1 శాతం మాత్రమే నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం జననాల్లో బాలురు 3.68 లక్షల మంది కాగా, బాలికలు 3.34 లక్షలు. మరణించినవారిలో పురుషులు 1.44 లక్షలుండగా.. మహిళలు లక్ష మంది ఉన్నారు.