టీమిండియాలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు . ఐపీఎల్ 2025 తర్వాత అయ్యర్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకూ చేర్చిన రికార్డు సృష్టించాడు. కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా దేశవాళీ క్రికెట్‌లోనూ అయ్యర్ సత్తా చాటుతున్నాడు. తన సారథ్యంలో పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన శ్రేయాస్ అయ్యర్.. వారం రోజులు కూడా తిరగకముందే మరో జట్టును ఫైనల్‌లో నిలబెట్టాడు. టీ20 ముంబై లీగ్‌లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. గత ఏడాది కాలంగా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ వహించిన అన్నీ జట్లు ఫైనల్‌కు రావడం విశేషం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్ 2024, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, ఐపీఎల్ 2025, టీ20 ముంబై లీగ్ ఇలా ఇండియాలో జరిగిన అన్నీ లీగ్స్‌లోనూ శ్రేయాస్ అయ్యర్ జట్టే ఫైనల్‌కు చేరింది. అయ్యర్ కెప్టెన్సీ చేసిన అన్నీ జట్లలో ఐపీఎల్ 2025 మినహా మిగతా అన్నీ లీగ్స్‌లోనూ ట్రోఫీ అందుకుంది. ఇప్పుడు ముంబై టీ20 లీగ్‌లో కూడా ట్రోఫీ అందుకోవాలని అయ్యర్ చూస్తున్నాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు టీమిండియా వైట్ బాల్ కెప్టెన్సీ రేసులోనూ నిలవడం విశేషం. టీ20 ముంబై 2025లో జరిగిన సెమీ ఫైనల్ 2 మ్యాచ్‌లో నమో బంద్రా బ్లాస్టర్స్‌పై సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నమో జట్టు 20 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. ఈజీ టార్గెట్ ఛేజింగ్‌లో బరిలోకి దిగిన సోబో ముంబై 14.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టి నిరాశ పరిచాడు. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఈ నెల 12న ముంబై వాంఖడే వేదికగా ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టుతో తలపడనుంది. మరాఠా రాయల్స్‌కు సిద్థార్థ లాడ్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. జూన్ 4న ప్రారంభమైన ఈ లీగ్ జూన్ 12న ముగియనుంది.