నైరుతి రుతుపవనాల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్‌తో సహా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల అంచనా ప్రకారం.. రానున్న మూడు రోజుల పాటు (నేటి నుంచి జూన్ 17 వరకు) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, పిడుగులతో కూడిన కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. రుతుపవనాల రాక, విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కల్పించాయి. చాలా మంది రైతులు ఇప్పటికే భూమిని దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులను ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి నారు పోయడానికి సిద్ధమవుతున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూమిలో తగినంత తేమ చేరడంతో విత్తనాలు మొలకెత్తడానికి, పంటల ఎదుగుదలకు ఇది దోహదపడుతుందని వారు చెబుతున్నారు.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.