కొంతమంది రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునే పనులు చేస్తున్నారు. నలుగురిలో ఉన్నామనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంతా చూస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు అని కూడా లేకుండా తమ లోకంలో మునిగిపోతున్నారు. ఇక లవర్స్ అయితే ఎక్కడపడితే అక్కడే హగ్‌లు, ముద్దులతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక యువతీయువకుల జంట.. బైక్‌పై ప్రయాణిస్తూనే ప్రమాదకరమైన విన్యాసం చేయడం.. పక్కనే వెళ్తున్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియో కాస్తా నోయిడా ట్రాఫిక్ పోలీసుల వద్దకు చేరింది. దీంతో వెంటనే స్పందించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ బైక్ నంబర్ ఆధారంగా రూ.53,500 భారీ జరిమానా విధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.నోయిడా-గ్రేటర్ నోయిడా మధ్య ఎక్స్‌ప్రెస్‌వేపై యువతీయువకులు చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బైక్‌పై వెళ్తున్న జంట.. లోకాన్ని మర్చిపోయి హగ్‌లు, కిస్‌లతో బరితెగించేసింది. యువకుడు బైక్ నడుపుతుండగా.. యువతి అతడి ముందు పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని వెనక్కి తిరిగి.. ఆ యువకుడిని గట్టిగా హగ్ చేసుకుంది. తన కాళ్లతో గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ ముద్దుల్లో మునిగిపోయారు. బైక్‌పై అత్యంత ప్రమాదకరమైన విన్యాసం చేశారు. ఆ యువకుడి హెల్మెట్‌ను యువతి పట్టుకోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అదే ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న వారు ఈ తతంగం మొత్తం వీడియో తీసిన సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అయింది. నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియో నోయిడా ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. దీంతో అప్రమత్తమై స్పందించిన .. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆ బైక్ నంబర్‌పై రూ.53,500 ఫైన్ వేశారు. ఇక నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న సీసీటీవీల ఆధారంగా ఈ లవర్స్ జంటపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన 5 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ బైక్ ఢిల్లీకి సంబంధించింది అని రిజిస్ట్రేషన్ నంబర్‌ ఆధారంగా తెలుస్తోంది.ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. అయితే నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ఈ వైరల్ వీడియోపై చర్యలు తీసుకుని.. బైక్ ఓనర్‌పై జరిమానా విధించినట్లు ఎక్స్‌లో ఒక పోస్ట్‌కు ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు సంబంధిత వాహనంపై ఈ-చలాన్ జారీ చేయడం ద్వారా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.