5 బంతుల్లో 5 వికెట్లు.. ‘నోట్‌ బుక్స్ సెలబ్రేషన్స్’ దిగ్వేష్ రాథీ సూపర్ షో..!

Wait 5 sec.

దిగ్వేష్ రాథీ.. ఐపీఎల్ 2025 ఫాలో అయిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే ఈ కుర్రాడు.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆటతో మెప్పించిన ఈ స్పిన్నర్.. తన చేష్టలతో మాత్రం చర్చనీయాంశంగా మారాడు. ముఖ్యంగా నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో ఐపీఎల్ సమయంలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. అయితే తాజాగా అతడు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అతడు ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసినట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోను ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్, ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా షేర్ చేయడం గమనార్హం. అయితే ఈ వీడియో ఎప్పటిది? ఏ టోర్నీ అనేది మాత్రం తెలియలేదు. కానీ సంజీవ్ గోయెంకా మాత్రం తన ట్వీట్‌లో స్థానిక టీ20 లీగ్ అని పేర్కొన్నారు. దీంతో ఇది ఏదో ఒక టీ20 లీగ్‌లో జరిగిందనే విషయం స్పష్టమవుతోంది. ఇందులో దిగ్వేష్ రాథీ.. వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.కాగా ఈ మ్యాచ్‌లో మొత్తంగా దిగ్వేష్ రాథీ ఏడు వికెట్లు తీశాడు. 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ స్పిన్నర్.. 28 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లను పడగొట్టాడు. అప్పటికే మూడు ఓవర్లు బౌలింగ్ వేసిన రాథీ.. ప్రత్యర్థి జట్టు విజయానికి 36 బంతుల్లో 113 పరుగులు అవసరమైన సమయంలో తన చివరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. మిస్టరీ గూగ్లీలతో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇందులో ఏకంగా నలుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. మరో బ్యాటర్ మాత్రం వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.కాగా ఐపీఎల్ 2025 ద్వారా దిగ్వేష్ రాథీ.. తొలిసారి ఈ మెగా లీగ్‌లోకి అడుగుపెట్టాడు. తనకు అవకాశం ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తాచాటాడు. 13 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీశాడు. నోట్ బుక్ సెలబ్రేషన్స్‌తో రెండు సార్లు జరిమానా.. ఒక మ్యాచ్‌ నిషేధం కూడా ఎదుర్కొన్నాడు.