KPHB హౌసింగ్ బోర్డు స్థలాల వేలం.. గజం రూ.2.98 లక్షలు, అమ్మో అన్ని కోట్లా..?

Wait 5 sec.

హైదరాబాద్‌ బుధవారం అధికారులు వేలం వేశారు. ఈ వేలంలో రికార్డు స్థాయిలో రూ.141.36 కోట్ల ఆదాయం సమకూరింది. పశ్చిమ డివిజన్‌ 198 గజాల నుంచి 987 గజాల విస్తీర్ణం కలిగిన 18 ఇళ్ల స్థలాలను 87 మంది పోటీదారులు దక్కించుకున్నారు. మొత్తం 6,236.33 గజాల స్థలాలు విక్రయించబడ్డాయి. హౌసింగ్‌బోర్డు కమిషనర్‌ గౌతమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ-హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముందుగా ఏడో ఫేజ్‌లోని నాలుగు వరుస స్థలాలకు కనీస ధర రూ.1.25 లక్షలు ఉండగా.. గజానికి రూ.2 లక్షలకు పైగా ధర పలికింది. మలుపులోని ఎంఐజీ ప్లాట్‌కు అత్యధికంగా గజానికి రూ.2.52 లక్షలు లభించింది. తర్వాత కనీస ధర రూ.1.50 లక్షలతో వేలం నిర్వహించిన స్థలాలకు అత్యధికంగా గజానికి రూ.2.98 లక్షలు, అత్యల్పంగా రూ.1.70 లక్షలు పలికాయి. కైతలాపూర్‌లో 36.16 గజాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని సైతం గజం రూ.1.14 లక్షలకు విక్రయించారు. ఈ స్థాయిలో డిమాండ్ రావటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. ఇది హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ పెరుగుతున్నట్లు సూచిస్తుందని చెప్పారు. కాగా, ప్రభుత్వం నిర్వహించే వేలంలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అందకు పలు కారణాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములకు సాధారణంగా ఎలాంటి వివాదాలు ఉండవు. యాజమాన్య పత్రాలు స్పష్టంగా, పారదర్శకంగా ఉంటాయి. ప్రైవేట్ భూముల్లో తరచుగా కనిపించే కోర్టు కేసులు, ఎన్‌కంబరెన్స్‌లు వంటి సమస్యలు ప్రభుత్వ భూముల్లో తక్కువగా ఉంటాయి. ఇది కొనుగోలుదారులకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వాలు సాధారణంగా ప్లాట్లను వేలం వేసే ముందు వాటి చుట్టూ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాయి. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువ. కేపీహెచ్‌బీ-హైటెక్ సిటీ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలకు రికార్డు ధరలు పలకడానికి ఇదొక ప్రధాన కారణమని చెబుతున్నారు.