16 గజాల స్థలంలో మూడు అంతస్తుల భవనం కట్టడం సాధ్యమా.. నో డౌట్ అసాధ్యమనే సమాధానం వస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం 16 గజాల స్థలంలో మూడంస్తుల భవనాన్ని నిర్మించాడు. ఏం జరిగిందని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి.. ఈ భవనం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో నిర్మించడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో 16 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.. దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి ఆ ప్రాంతానికి వెళ్లారు.. ఈ భవనాన్ని చూసి షాకయ్యారు. అనుమతులు లేకుండా కడుతున్నారని తెలుసుకుని పంచాయతీ కార్యదర్శిని వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు.పాలకోడేరు మంగయ్య చెరువు సమీపంలో చిన్న స్థలంలో ఈ భవనం కడుతుండటం చర్చనీయాంశమైంది. రోడ్డు పక్కన స్థలం ఉండటంతో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామ కంటపడింది. స్థానికులు అనుమతులు తీసుకోలేదని చెప్పడంతో డిప్యూటీ స్పీకర్ సీరియస్ అయ్యారు. పంచాయతీ కార్యదర్శిని పిలిచి.. ఆ భవనాన్ని అనుమతి లేకుండా నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో ఈ భవనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంత తక్కువ స్థలంలో మూడు అంతస్తలు నిర్మించడం అంత సేఫ్ కాదంటున్నారు.