ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది.. అన్నదాత సుఖీభవ పథకంపై క్లారిటీ వచ్చేసింది. రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. సాయాన్ని మూడు విడతల్లో ఇస్తామని.. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో పాటుగా రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు ఈ నెల 20న కింద మొదటి విడతగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. మంత్రి ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రైతులకి వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదని.. కూటమి ప్రభత్వం అధికారంలోకి రాగానే పరికరాలు ఇస్తున్నామన్నారు.'దెందులూరు నియోజకవర్గం వంగూరులో స్థానిక శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు,ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతుల సంక్షేమమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది రైతులకు అత్యంత ముఖ్యమైన పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. రాబోవు ఖరీఫ్ లో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. సన్న బియ్యం రకాలను ఎక్కువగా పండించాలి. కౌలు రైతులకు బ్యాంకర్ల నుండి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నాం. వ్యవసాయంలో యాంత్రికరణ అవసరం , రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అయినా కూడా రైతులకు 24 గంటల్లోనే ధాన్యం కొలుగోలు డబ్బులను వేస్తున్నాం. జూన్ 20న అన్నదాత సుఖీభవ తొలి పెడుతూ డబ్బులను రైతుల ఖాతాలో వేస్తాం' అంటూ ట్వీట్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు పెదవేగిలో కోకో, పామాయిల్ పంటలను పరిశీలించారు. రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పామాయిల్ తరహాలోనే కోకో గింజల కొనుగోలుకు ఒక విధానం తీసుకుంటామన్నారు అచ్చెన్నాయుడు. పంట నాణ్యంగా ఉంటేనే మంచి ధర వస్తుందని.. కంపెనీలు చెప్పే మాటలు ఆచరణలో ఉండటం లేదని రైతులు మంత్రికి వివరించారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రాయితీపై పరికరాలు ఇవ్వాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ఏలూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.చివరి ఆకు వరకు పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పొగాకు పంటకు బీమా పథకాన్ని మళ్లీ మొదలు పెట్టామన్నారు. అలాగే ప్రమాద బీమాను రూ.7 లక్షలకు పెంచామని, ప్రత్యేక నిధులతో వెంటనే పరిహారం అందేలా చూస్తామన్నారు. గ్రేడ్-ఏ రకం క్వింటాకు రూ.12 వేలు, గ్రేడ్-బీ రకం రూ.5,400 ధర నిర్ణయించామన్నారు. ITC, JPI సంస్థలతో 20 వేల మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని.. మార్క్‌ఫెడ్ ద్వారా 75 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరకు కంపెనీలతో కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జగన్‌ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పొగాకు రైతుల మధ్య పొగ పెట్టాలని చూస్తున్నారని.. రైతులు నాణ్యమైన పంటలు పండించి మంచి ధర పొందాలన్నారు.