: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ భర్త హత్య కేసులో రోజుకో కోణం వెలుగు చూస్తోంది. పెళ్లి జరిగి 2 వారాలు కూడా పూర్తి కాకముందే.. భార్యనే పక్కా ప్లాన్ ప్రకారం.. కిరాయి రౌడీలతో తన భర్తను చంపించిన ఘటన దేశం మొత్తాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. ఈ నేపథ్యంలోనే సోనమ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న పోలీసులకు.. ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడి అవుతున్నాయి. ఈ కేసులో ప్రతీ చిన్న క్లూను ఆధారంగా చేసుకుని.. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళసూత్రంతో దొరికిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఆ మంగళసూత్రం ఆధారంగా ఈ కేసులో విచారణ జరపగా.. అసలు సంగతి వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వివరించారు. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని.. అతడి భార్య సోనమ్.. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతోపాటు మరో ముగ్గురు కిరాయి హంతకులు కలిసి ప్లాన్ ప్రకారం.. చంపేశారు. అయితే మేఘాలయాలో రాజా రఘువంశీ-సోనమ్ దంపతులు ఉన్న హోటల్ రూమ్‌లో పోలీసులు సోదా చేస్తుండగా.. అక్కడ ఆమె మంగళసూత్రం దొరికింది. అయితే దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. హత్య జరిగిన మే 23వ తేదీన రాజా రఘువంశీ-సోనమ్ బయటికి వెళ్లినపుడు.. ఆమె తన తాళిని, ఉంగరాన్ని గదిలోనే వదిలేసి వెళ్లినట్లు డీఐజీ డీఎన్ఆర్ మారక్ వెల్లడించారు.అయితే కొత్తగా పెళ్లి అయిన మహిళ.. రూంలోనే తాళిని, సూట్‌కేస్‌లో ఉండరాన్ని పెట్టి వెళ్లడం తమకు కొత్త అనుమానాలను కలిగించిందని డీఐజీ తెలిపారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే ఒక తన తాళిని ఎలా తీసివేయగలదని అనుమానం వచ్చి.. ఆ యాంగిల్‌లో క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టగా.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా.. వారు తమ నేరాన్ని అంగీకరించినట్లు మేఘాలయ పోలీసులు వెల్లడించారు.