అనధికారిక లేఅవుట్లలోని (LRS - Layout Regularisation Scheme) గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 25 శాతం రాయితీతో కూడిన ఈ పథకానికి జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి సోమవారం (జూన్ 16) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా నిర్ణయంతో లబ్ధిదారులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి మరో సువర్ణావకాశం లభించింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లోఅక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగా.. ఆ సమయంలో 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే గతేడాది నాటికి 10 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కరించబడ్డాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రస్తుత రేవంత్ సర్కార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం మినహాయింపు (OTS) ప్రకటించింది. తొలుత మార్చి నెలాఖరు వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి వ అయితే, ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో స్పందన లేకపోవడంతో మరోసారి దరఖాస్తుదారులకు అవకాశం కల్పించింది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జూన్ 30 తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి మాత్రమే 25 శాతం రాయితీ అవకాశం ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఎలాంటి రాయితీలు వర్తించవని, ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి ఫీజును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేసిన జీవో 28 ప్రకారం, ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు చెల్లిస్తే ఈ రాయితీని పొందవచ్చు. LRS ప్రయోజనాలుLRS పథకం ద్వారా స్థలాలను క్రమబద్ధీకరించుకోవడం వల్ల దరఖాస్తుదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే కచ్చితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణ ద్వారా సులభంగా ఇంటి నిర్మాణ అనుమతులు లభిస్తాయి.లేఅవుట్ నిబంధనలు పాటించని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా, మౌలిక వసతులు (త్రాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్) కూడా అందవు. LRS పూర్తి చేసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు.ప్లాట్‌పై రుణాలు తీసుకోవడం లేదా ఇతర ఆర్థిక లావాదేవీల విషయంలో LRS ధ్రువపత్రాలు కీలకంగా మారుతాయి.ప్రస్తుతం, 2020 నాటికి కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు మాత్రమే ఈ 25 శాతం రాయితీ వర్తిస్తుంది. ఇతర ప్లాట్లకు ఈ నిర్ణయం వర్తించదు. అధికారులు ఇప్పటికే పరిశీలించిన దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు. అర్హత ఉన్న వారికి ప్రొసీడింగ్స్ కాపీలను అందజేస్తున్నారు. సాంకేతిక సమస్యలను కూడా అధిగమించి మిగిలిన దరఖాస్తులను త్వరలోనే పరిష్కరించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పొడిగింపును సద్వినియోగం చేసుకొని తమ ఆస్తులను చట్టబద్ధం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.