'నిన్న చెప్పాడు.. నేడు చేశాడు'.. మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసల జల్లు!

Wait 5 sec.

దేశ సరిహద్దులో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే ఏపీకి చెందిన ఓ జవాన్‌కు పెద్ద కష్టమే వచ్చింది. విధి నిర్వహణలో ఉన్న ఆయన.. తన సమస్యను చెబుతూ ఓ వీడియో తీసి పంపారు. ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించారు.. 24 గంటల్లోనే సమస్యను పరిస్కరించారు. శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో బీఎస్‌ఎఫ్ జవాన్ నరసింహమూర్తి.. తన భూమిని కబ్జా చేశారని ఆయన సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమి కబ్జాకు గురైందన్నారు. తన భూమిని వైఎస్సార్‌సీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసిన నాగరాజు కబ్జా చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని మంత్రి నారా లోకేష్‌ను కోరారు. వెంటనే స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులకు భూ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి సర్వే నిర్వహించారు.. అనంతరం పోలీసుల సమక్షంలో భూమి హద్దులు నిర్ణయించడంతో జవాన్ నరసింహమూర్తి భూ సమస్య పరిష్కారమైంది. తన సమస్య పరిష్కరించినందుకు నరసింహమూర్తి కుటుంబ సభ్యులు మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'ఆర్మీ జవాను భూ సమస్యను 24 గంటల్లోనే పరిష్కరించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను. దీంతో సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో సమస్యకు పరిష్కారం లభించింది' అంటూ ట్వీట్ చేశారు. గతంలో కూడా మరో జవాన్ కూడా తన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించగా.. ఆ సమస్యను పరిష్కరించారు.