ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు అండగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన 23 మంది న్యాయవాదుల కుటుంబ సభ్యులకు పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు 23మందికి రూ.4 లక్షల చొప్పున రాష్ట్రప్రభుత్వం రూ.92 లక్షలు విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీచేశారు. కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ప్రభుత్వం వంతుగా డబ్బులు ఇచ్చింది. 'ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యత్వం తీసుకున్న లాయర్లు చనిపోతే రూ.8 లక్షల చొప్పున పరిహారం అందిస్తారు. ఈ రూ. 8 లక్షల్లో.. రాష్ట్రప్రభుత్వం రూ.4 లక్షలు, ఏపీ అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి బార్‌ కౌన్సిల్‌ మరో రూ.4 లక్షలు అందజేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే 23 మందికుటుంబసభ్యులకు బార్‌కౌన్సిల్‌ రూ.4 లక్షల చొప్పున చెల్లించగా.. తాజాగా ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున డబ్బులు చెల్లించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బుల్ని ఏపీ బార్‌ కౌన్సిల్‌ పర్యవేక్షణలో నామినీలకు పంపిణీ చేస్తారు' అని ఏపీ న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఓ ప్రకటనలో తెలియజేశారు.రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి పీఎం వికాస్, పీఎంజేవీకే, ఎన్‌ఎండీఎఫ్‌సీ, తదితర కేంద్ర పథకాలు సమర్థంగా అమలయ్యేలా చూడాలి. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. కేంద్ర పథకాల అమలుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి. స్వయం ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, రాయితీ రుణాల పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరాలి’ అని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ సచివాలయంలో కేంద్ర పథకాల తీరుపై సమీక్షలో అధికారులను ఆదేశించారు. 'ఆదరణ పథకం కింద ప్రభుత్వం కులవృత్తిదారులకు అధునాతన పరికరాలు అందిస్తున్నాము. వారి వృత్తిని సులభతరం చేసేందుకు ఎలాంటి పరికరాలు అవసరమో ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించాలి. కులవృత్తిదారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళలకు అందిస్తున్న ఉచిత కుట్టు శిక్షణపై ఆరా తీశారు. ‘మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉచిత కుట్టు శిక్షణ పూర్తైన తరవాత కుట్టు మిషన్లు సైతం ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. లబ్ధిదారుల హాజరు వందశాతం ఉండేలా చూడాలి. శిక్షణ కేంద్రాలను జిల్లా ఈడీలు తరచుగా సందర్శించాలి' అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సూచించారు. సచివాలయంలో అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబ్ల్యూఎస్‌) సంక్షేమ విభాగం ముఖ్య కార్యదర్శిగా కె.సునీతను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆ పోస్టుని ఎస్‌.సత్యనారాయణ పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు. సునీత 1996 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.