Interest Free Loans: ప్రస్తుతం మన దేశంలో చదువులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. విద్యా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. ముందు ముందు ఇది మరింత పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న పిల్లల చదువులు ఎల్‌కేజీకి సైతం వేల నుంచి లక్షల ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఇక ఇంటర్, డిగ్రీ, పీజీ సహా ప్రత్యేక కోర్సులకు లక్షల్లో చెల్లించాలి. దీంతో చాలా మంది ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుంటారు. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుని అధిక వడ్డీలు చెల్లిస్తుంటారు. అయితే, అలాంటి వారందరికీ ఇదో గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఎలాంటి వడ్డీ లేకుండా ఫీజుల కోసం లోన్ తీసుకోవచ్చు. ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ విద్యా సంస్థల ఫీజులు కట్టేందుకు ఇండియాఎడ్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఎలాంటి వడ్డీ లేకుండానే రుణాలు అందిస్తోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ వడ్డీ రహిత లోన్స్ ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటికే పలు స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఎడ్ టెక్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఆక్సిలో ఫిన్‌సర్వ్ తెలిపింది. రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఫీజులు చెల్లించేందుకు లోన్ ఇస్తామని తెలిపింది. కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రహ్మణ్యం తెలిపారు. 3 నుంచి 72 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చని తెలిపారు. ఎలాంటి వడ్డీ ఉండదని స్పష్టం చేశారు. లోన్‌కి అర్హత సాధించిన వెంటనే అంటే 24 గంటల్లోనే ఒప్పందం చేసుకున్న స్కూల్, కాలేజీ, కోచింగ్ సెంటర్లకు కావాల్సిన ఫీజుల మొత్తాన్ని బదిలీ చేస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థులకు ఎదురయ్యే ప్రధాన ఆర్థిక సవాళ్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారు తమ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. పెరుగుతున్న ఫీజులు చెల్లించలేక చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పిల్లలు మంచి స్కూల్, కాలేజీలో చదవాలనే ఆశతో వేలు, లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. తమ స్తోమతకు మించి పెద్ద చదువులు చదివిస్తున్నారు. అలాంటి వారికి ప్రస్తుతం ఉన్న ఫీజులు తలకు మించిన భారమనే చెప్పాలి. అయితే, అలాంటి వారందరికీ ఆక్సిలో ఫిన్‌సర్వ్ వంటి సంస్థలు అందిస్తున్న సేవలు ఊరట కల్పిస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి వడ్డీ రహిత రుణాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.