ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏపీకే ఫైల్స్‌ లింక్‌లపై క్లిక్ చేయొద్దని.. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా వచ్చే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొందరు సైబర్ నేరగాళ్లు కొద్దిరోజులుగా పీఎం కిసాన్ యోజన, ఎస్‌బీఐ ఈకేవైసీ, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు పేర్లతో మోసపూరిత లింక్స్ పంపిస్తున్నారన్నారు. ఆ ఏపీకే ఫైల్స్ లింక్‌లపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళుతుందంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ముఖ్యంగా ఏపీలో రైతుల్ని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. పీఎం కిసాన్ పేరుతో వాట్సాప్ ద్వారా నకిలీ ఏపీకే లింక్‌లను పంపిస్తున్నారు. పొరపాటున వాటిని క్లిక్ చేయగానే మొబైల్‌‌లో వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ కేటుగాళ్లకు చేరుతోంది. ఇటీవల సత్యసాయి జిల్లాలో ఒక రైతు ఇలా మోసపోయాడు.. పీఎం కిసాన్ యోజన పేరుతో వచ్చిన ఫేక్ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేశాడు. ఆ వెంటనే ఆ రైతు బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.94 వేలు పోయాయి. ఇలాంటి మోసాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని గుర్తించారు. ఈ క్రమంలో ఏపీలో సైబర్ విభాగం సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ప్లే ప్రొటెక్ట్ సదుపాయాన్ని ఆన్ చేసుకోవాలని.. అలాగే ముందస్తు జాగ్రత్తగా నార్టన్, బిట్ డిఫెండర్, అవాస్ట్ వంటి యాంటీ వైరస్ యాప్‌లను ఉపయోగించాలని సూచించారు.ఏపీకే ఫైల్స్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను క్లిక్ చేయొద్దని హెచ్చరించారు. అంతేకాదు అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. 'రాష్ట్రంలో సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలు అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాము' అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఏపీకే లింక్స్ క్లిక్ చేయొద్దని సూచించారు.