ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా పనుల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) సాంకేతిక పరీక్షలు (ట్రయల్ రన్ వంటి) చేసింది. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రన్‌వే, సిగ్నల్ వ్యవస్థ వంటి పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ ఏటీసీ టవర్ నుంచి వచ్చే సంకేతాలపై AAI, DGCA సంస్థలు పరీక్షలు నిర్వహించాయి. చిన్న విమానంతో ట్రయల్ రన్ చేస్తూ ఈ పరీక్షలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం చక్కర్లు కొట్టింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం రన్‌వేకు దగ్గరగా వచ్చి ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించింది.. కానీ మళ్లీ పైకి ఎగిరిపోయింది. ఆ విమానం ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ సముద్రం వైపు వెళ్లిపోయింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు దీన్ని ఆశ్చర్యంగా చూశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సిగ్నల్, రన్‌వే టెస్టు కోసం విమానం వచ్చిందని భావిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న విమానాశ్రయ పరిస్థితి, చేయాల్సిన పనులు, చిన్నచిన్న మార్పులు, అడ్డంకులు వంటి వాటిని పరిశీలించడానికి అప్పుడప్పుడు నిర్వాహకులు విమానంతో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఇటీవల భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో విమానం గాల్లో చక్కర్లు కొట్టి వెళ్లింది అంటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి పనులు స్పీడ్ అందుకున్నాయి. ఈ పనుల్ని మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు విమాన సేవలు నిలిపివేస్తారు. ఈ విమానాశ్రయాన్ని నేవీకి అప్పగించనున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో గన్నవరం, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయంటున్నారు. మరోవైపు విజయవాడలో విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రూ.470 కోట్లతో నిర్మిస్తున్నారు.. వాస్తవానికి భవనం పనులు జూన్‌‌కు పూర్తి చేయాలనుకున్నా కుదరలేదు. ఈ ఏడాది ఆగస్టు 15లోగా పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని బావించారు.. కానీ ఆ దిశగా అడుగులుపడలేదు. ఈ పనులు ప్రస్తుతం 75 శాతం పూర్తయ్యాయి.. మరో రెండు నెలల్లో మిగతా పనులు పూర్తిచేస్తారా లేదా అన్నది చూడాలి. కేంద్రం గన్నవరంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌కు 2018లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.