ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా టేలెండర్స్ విఫలమైతే.. అదే ఇంగ్లండ్‌పై మన అండర్ -19 ప్లేయర్లు అదరగొట్టారు. టెస్టులో టేలెండర్స్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పడితే.. తొమ్మిదో స్థానంలో వచ్చిన అండర్ 19 ప్లేయర్ సెంచరీతో ఇరగదీశాడు. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే విఫలమైన ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్, టేలెండర్స్ మ్యాచ్‌ని నిలబెట్టి భారీ స్కోర్ అందించారు. ఈ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ టేలెండర్స్ అంటే ఇలా ఆడాలి అంటూ అండర్ 19 జట్టుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.. తొలి అధికారిక వన్డే జూన్ 27న ప్రారంభం కానుండగా.. జూన్ 24న ఇంగ్లండ్ యంగ్ లయన్స్‌తో ఇండియా అండర్ 19 జట్టు మధ్య వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 213 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ యంగ్ లయన్స్ ఇన్విటేషనల్ లెవన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఇండియా -19కు ఐపీఎల్ హీరోస్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ శుభారంభం ఇవ్వలేకపోయారు. మొదటి ఐదుగురు బ్యాటర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఆయుష్ మాత్రే 1, వైభవ్ సూర్యవంశీ 17, విహాన్ మల్హోత్ర 39, మౌల్యరాజసిన్హా చవ్దా 23, అభిజ్ఞాన్ కుందు 6 పరుగులకే అవుటయ్యారు. టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో కేవలం 91 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దాంతో 150 పరుగులలోపే ఆలౌట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ మిడిలార్డర్, టేలెండర్స్ ఎవ్వరూ ఊహించనట్టు ఆడి 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 442 పరుగులు చేశారు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హర్‌వన్ష్ సింగ్ పంగాలియా 52 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ కుమార్ 73, కనిష్క్ చౌహాన్ 79 పరుగులు, ఆర్ఎస్ అంబరీష్ 24 బంతుల్లో 47 పరుగులతో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశారు. ఇండియా - 19 అందించిన భారీ స్కోర్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ యంగ్ లయన్స్ జట్టు 41.1 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ విల్ బెన్నీసన్ 103 పరుగులతో రాణించాడు. టీమిండియా ఏకంగా తొమ్మిది మందితో బౌలింగ్ చేయించడం విశేషం. దీపేష్ దేవంద్రన్ మూడు వికెట్లు తీసుకోగా, నమన్ పుష్పక్ రెండు వికెట్లు తీశాడు.