కలకు, కళకు ఎంతో తేడా ఉంది. అలాగే సినిమాకు, వాస్తవానికి కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. తెలిసీ తెలియని వయసు, ఉడుకు రక్తం, ఏదైనా చేయగలమనే ధీమా, ఎవడ్రా మనల్ని ఆపేదనే మొండి ధైర్యం.. మీసమొచ్చింది ఇక మగాళ్లమై పోయామనే విశ్వాసం.. మెచ్చిన హీరో చెప్పిన డైలాగ్ ఎక్కించిన ఓ రకమైన మదం.. కారణమేదైతేనేం చదువుకోవాల్సిన వయసులో మనసు పక్క చూపులు చూస్తోంది. ఓరకంటి చూపులకు చిక్కి.. బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటోంది. అలా చిన్నవయసులోనే తప్పటడుగులు వేసి.. జైలు గోడల నడుమ చిక్కిన ఓ యువకుడి కథ ఇది. (అనంతపురంలో జరిగిన యదార్థ ఘటన.. పేర్లు మార్చడం జరిగింది)పదో తరగతి పూరైంది.. పాఠశాల నుంచి జీవితం కళాశాలకు చేరింది. లోకమంతా కొత్తగా.. రంగు రంగులుగా కనిపిస్తోంది. వయసు తాలూకు ప్రభావమో.. శరీరంలోని హార్మోన్ల ఎఫెక్టో.. ఉబికిపడుతున్న యవ్వన మోహమో తెలియదు కానీ.. ఇన్ని రోజులు తాళ్లతో కట్టేసిన మనసు.. సంకెళ్లు విప్పుకుని స్వేచ్ఛగా విహరిస్తున్నట్లుంది మోహన్‌కి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టాడు. అన్నీ తెలియని ముఖాలు.. ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అంతా గజిబిజిగానే ఉన్నా., మనసెందుకో సంతోషంగా ఉంది. రకరకాల పువ్వులతో కలకలలాడుతున్న ఉద్యానవనంలోకి అడుగుపెట్టిన సీతాకోకచిలుకలా.. పురివిప్పుకుని ఎగురుతోంది. ఎటు చూసినా తెలియని ముఖాలే.. ఆ తెలియని ముఖాల మధ్యలో చటుక్కున అలా మెరిసిందో తార.. ఎప్పుడూ చూడని మొహమే.. ఎన్నడూ ఎరుగని నవ్వే..కానీ, ఎంతో పరిచయమున్న వ్యక్తిలా అనిపించింది.రోజులు గడుస్తున్నాయి. పరిచయం లేని ఆ ముఖంలో కనిపించే నవ్వుల కోసం మోహన్ చూపులు కాలేజీ అణువణువూ వెతుకుతున్నాయి. ఓ రోజు అనుకోకుండా చూపులు కలిశాయి. ఆ తర్వాత మాటలు కలిశాయి. మాటల మధ్యన తెలిసిందేంటంటే మోహన్ కన్నా తను సీనియర్. మోహన్ ఇంటర్ మొదటి సంవత్సరం అయితే.. తను సెకండియర్. కానీ అదేదీ వారి మాటలకు అడ్డు రాలేదు. ఆ మాటలు కాస్తా సెల్‌ఫోన్ ముచ్చట్లుగా మారాయి. ఆ సెల్ ఫోన్ ముచ్చట్లే ప్రేమకు దారితీశాయి. తనది ఇంటర్ పూర్తి అయ్యింది. ఇంట్లో వాళ్లు చదువు ఆపేయించారు. ఇంటి దగ్గరే ఉండిపోయింది. అయితే మోహన్‌తో మాత్రం ప్రేమ ముచ్చట్లు ఆపలేదు. ఈ విషయం ఆమె తల్లిదండ్రుల కంటబడింది. ఇంకేముంది.. అందరు తల్లిదండ్రుల లాగానే వీరు కూడా ఆలోచించారు. మంచి అయ్యను చూసి పెళ్లి చేస్తే.. సరిపోతుందనుకున్నారు. పెళ్లి సంబంధాలు వెతకడం మొదలెట్టారు. కానీ ఈ ప్రేమ జంట.. మరో నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కుటుంబాల్లోనూ చెప్పకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. తమ జీవితం, తమ పెళ్లి, తమ ఇష్టం అనుకుని పెద్దలకు చెప్పకుండా ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన ఈ జంట బాపట్ల జిల్లా చేరింది. చీరాలలో అద్దెకు దిగింది. అక్కడే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించారు. కానీ రెండు నెలలు గడిసేసరికి.. వీరు అనుకున్నవన్నీ తల్లకిందులయ్యాయి. మనమొకటి తలిస్తే.. దేవుడొకటి తలుస్తాడని అంటారు కదా.. అలాగే.. అమ్మాయి కుటుంబసభ్యులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులోనే ప్రేమ జంట.. చీరాలలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. అమ్మాయిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మోహన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. అలా చిన్న వయసులోనే ప్రేమ మత్తులో తప్పటడుగులు వేసిన మోహన్ జీవితం.. జైలుపాలయ్యింది.