తెలంగాణలోని షాక్. పలువురికి రేషన్ నిలిచిపోనుంది. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్‌ కార్డుల విచారణ పూర్తయ్యింది. గత ఆరు నెలలుగా రేషన్‌ తీసుకోని 76,842 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. పౌర సరఫరాల శాఖ ఈ వివరాలను జిల్లాలవారీగా కలెక్టర్లకు పంపింది. త్వరలోనే వీరిని రేషన్‌ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి, ఉచిత బియ్యం కోటాను నిలిపివేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలుగా రేషన్‌ తీసుకోని వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా.. పౌర సరఫరాల శాఖ వాటిని జిల్లా కలెక్టర్లకు పంపింది. మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానిక విచారణ జరిపి, అర్హులను, అనర్హులను గుర్తించారు. అనర్హులుగా తేలిన వారిలో 60 శాతం మందికి పైగా వలస వెళ్లినవారు, మరణించినవారు, లేదా రెండు వేర్వేరు రేషన్‌ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఉన్నట్లు గుర్తించారు. అనర్హులుగా తేలిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ఈ ఏరివేత ద్వారా రేషన్‌ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే అనర్హులకు రేషన్ నిలిపివేయాలని భావిస్తోంది. ఇప్పటికే లిస్టు రెడీ కాగా.. వచ్చే నెల నుంచి ఆయా లబ్ధిదారులకు రేషన్ నిలిపివేయనున్నారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. జూన్ 1 నుంచి రేషన్ పంపిణీ ప్రారంభం కాగా.. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయటంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని రేషన్ దుకాణాల్లో ప్రజలు బారులు తీరుతున్నారు. వలస వచ్చిన వారు నగరంలోనే రేషన్ తీసుకుంటుండటంతో డీలర్లపై పనిభారం పెరిగింది. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మెుదలైంది. ఇప్పటికే పలువురికి కార్డులు మంజూరయ్యాయి. త్వరలోనే కూడా రేషన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిసింది. అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పగా.. మీసేవా కేంద్రాల ద్వారా అఫ్లికేషన్లు తీసుకుంటున్నారు.