తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకంపై వ్యవసాయశాఖ మంత్రి చేశారు. ఈ పథకం కింద 9 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులను విజయవంతంగా విడుదల చేసినట్లు చెప్పారు. శుక్రవారం వరకు 7 ఎకరాల భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేయగా.. శనివారం 8, 9 ఎకరాలు ఉన్న రైతులకు కూడా సహాయం అందించినిట్లు తెలిపారు. 8 ఎకరాలున్న 67,352 మంది రైతులకు సంబంధించిన 4.42 లక్షల ఎకరాలకు రూ. 265.91 కోట్లు విడుదలచేశామన్నారు. 9 ఎకరాలున్న 39,164 మంది రైతులకు చెందిన 3,23,875 ఎకరాలకు రూ. 194 కోట్లకు పైగా నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఆరు రోజుల్లోనే మొత్తం 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,770.83 కోట్లు జమ అయ్యాయని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న 2.13 లక్షల ఎకరాల భూములలో, 93,000 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువైనవి కాని భూములను గుర్తించి వాటికి సహాయం నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు. పంటలు పండుతున్న 1.20 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆయన పేర్కొన్నారు.సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతో ORR లోపల ఉన్న భూములకు పథకాన్ని వర్తింపజేయడానికి కొంత సమయం పట్టిందని, దీనిని బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని మంత్రి తుమ్మల విమర్శించారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా సద్వినియోగం చేయాలన్నది మా ఆలోచన అని చెప్పారు. దీనికి అనుగుణంగానే తాము ముందుకు వెళ్తుంటే విపక్షాలు రాద్ధాంతం చేయడం దారుణమని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కోసం నిధులు ఎప్పుడూ రూ. 7,624 కోట్లు దాటలేదని, అయితే తమ ప్రభుత్వం కేవలం 6 రోజుల్లోనే 9 ఎకరాల వరకు రైతు భరోసా కోసం రూ. 7,700 కోట్లు విడుదల చేసిందని తుమ్మల వెల్లడించారు.