పురుషుడి నుంచి స్త్రీగా మారిన ట్రాన్స్‌జెండర్‌ను సంతానోత్పత్తి సామర్థ్యం లేదనే కారణంతో మహిళగా పరిగణించకూడదనే వాదనను తోసిపుచ్చింది. ట్రాన్స్‌జెండర్లకు లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. పిల్లల్ని కనే సామర్థ్యం లేదన్న కారణంతో ట్రాన్స్‌ఉమన్‌కు స్త్రీ హోదా నిరాకరించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, (IPC సెక్షన్ 498(A)) కింద ఆమెకు ఫిర్యాదు చేసే హక్కు ఉందని తేల్చిచెప్పింది. అయితే ఈ కేసులో ఆమెపై వేధింపులు జరిగినట్లు ఆధారాలు లేనందున కేసును కొట్టివేసింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన షబానా. చెన్నైకి చెందిన విశ్వనాథన్‌ కృష్ణమూర్తి, షబానా ప్రేమించుకున్నారు. దీంతో 2019 జనవరి 21న హైదరాబాద్‌లో ఆర్య సమాజ్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత చెన్నైలోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిన కృష్ణమూర్తి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో చెన్నైలోని కృష్ణమూర్తి ఇంటికి వెళ్లిన షబానా అతడి తల్లిదండ్రులతో గొడవపడ్డారు. అయితే, వాళ్లు తనను చంపేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ ఆమె ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.తమ కుటుంంబంపై పెట్టిన కేసును కొట్టివేయాలని కృష్ణమూర్తి, అతడి తల్లిదండ్రులు 2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్స్‌జెండర్‌కు సంతానోత్పత్తి సామర్థ్యం ఉండదని, కాబట్టి ట్రాన్స్‌ఉమన్‌ను మహిళగా పరిగణించలేమని వారి తరపు న్యాయవాది వాదించారు. అందువల్ల షబానాకు IPC సెక్షన్ 498(A) కింద కేసు పెట్టే అర్హత లేదని అన్నారు. వేధింపులకు గురి చేశారనడానికి ఆధారాలు లేవని కూడా ఆయన వాదించారు. పోలీసుల తరఫున ఏపీపీ ప్రియాంక లక్ష్మి వాదనలు వినిపించారు.ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టుకతో వచ్చిన లింగమే శాశ్వతం కాదని అన్నారు. ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు. లింగ గుర్తింపు కోసం ట్రాన్స్‌జెండర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పుట్టినప్పుడు పేర్కొన్న లింగాన్నే తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం లేకుండా ఆదేశాలివ్వాలని కోరారని తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి రాజ్యాంగం కల్పించిన హక్కులు పురుషులు, స్త్రీలకే పరిమితం కాదని, ట్రాన్స్‌జెండర్లకు కూడా వర్తిస్తాయని తెలిపిందన్నారు.ఈ తీర్పునకు అనుగుణంగా 2019లో ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ (హక్కుల రక్షణ) చట్టాన్ని తీసుకొచ్చారని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వివాహం తర్వాత భిన్న లింగసంపర్క సంబంధం ఉన్న ట్రాన్స్‌ఉమన్‌/ట్రాన్స్‌జెండర్‌కు 498(A) కింద కేసు పెట్టే హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో కట్నం కోసం వేధించారని చెప్పడానికి తగిన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది.‘స్త్రీత్వాన్ని సంతానోత్పత్తికి పరిమితం చేసే సంకుచిత భావన రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేసి చూడటమే’ అని కోర్టు పేర్కొంది. పిల్లల్ని కనగలిగితేనే స్త్రీ అవుతారనే ఆలోచన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును కల్పించిందని గుర్తు చేసింది. ట్రాన్స్‌జెండర్లకు కూడా సమాన హక్కులు ఉంటాయని తేల్చి చెప్పింది.ట్రాన్స్‌జెండర్లకు తమ లింగ గుర్తింపును తామే నిర్ణయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, పిల్లల్ని కనే సామర్థ్యం లేదనే కారణంతో ట్రాన్స్‌ఉమన్‌కు స్త్రీ హోదాను నిరాకరించడం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే, IPC సెక్షన్ 498(A) కింద కేసు పెట్టే హక్కు లేదనడం కూడా ఆమె పట్ల వివక్ష చూపడమేనని కోర్టు అభిప్రాయపడింది. ట్రాన్స్‌ఉమన్‌కు ఆమె భర్త, అత్తమామలు, బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.