టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇంట విషాదం.. ఆయన తండ్రి, నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌ (72) గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో ఇటీవల చికిత్స నిమిత్తం చేరారు.. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రామయ్య గతంలో జర్నలిస్ట్‌గా పనిచేశారు.. 2001లో కందుకూరులో ప్రకాశం ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రారంభించారు. కంచర్ల రామయ్య సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములయ్యారు. ఆయన కుమారుడు కంచర్ల శ్రీకాంత్‌ తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. భౌతికకాయాన్ని శుక్రవారం కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో ఉంచి శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రామయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సంతాపం వ్యక్తంచేశారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కాలేజీ సిబ్బంది, పలువురు పాత్రికేయులు రామయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు.'ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. పాత్రికేయులుగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. పీఈసీని స్థాపించి ఆ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను రామయ్య చేరువ చేశారని కొనియాడారు. కంచర్ల శ్రీకాంత్ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు' అంటూ ప్రకటనను విడుదల చేశారు. 'ఈనాడు రామయ్యగా ప్రసిద్ధులైన ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య గారి మృతి బాధాకరం. వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. బహుముఖ ప్రతిభాశాలి అయిన రామయ్య గారు వివిధ రంగాల ద్వారా అందించిన సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ మంత్రి నారా లోకేష్ చేశారు. 'సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలిపారు. రామయ్య జర్నలిస్టుగా కెరీర్ ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రామయ్య కుమారుడు ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అంటూ ప్రకటనలో తెలిపారు.