టీడీపీని వీడి వైసీపీలోకి సీనియర్ నేత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తైన పదిరోజులేక ఊహించని పరిణామం జరిగింది. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఫ్యామిలీ పార్టీని వీడింది.. అది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా (ఉమ్మడి కడప జిల్లా) నుంచి కావడం ఆసక్తికరంగా మారింది. కడపలో మహానాడు నిర్వహించిన కొద్దిరోజులకే ఇలా జరగడం చర్చనీయాంశమైంది. టీడీపీలో సుదీర్ఘ కాలం కొనసాగిన సీనియర్ నేత కుటుంబం పార్టీని వీడటం కాస్త ఇబ్బందిగా మారింది. ఇటీవల పరిణామాలు తమను బాధించాయంటూ ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు.. తాజాగా ఆయన వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ సొంత జిల్లాలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాయచోటి నియోజకవర్గం నుంచి నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం వైఎస్సార్‌సీపీలోకి వెళుతోంది. ఈ నెల 24న (బుధవారం) తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో తాను వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. తన అనుచరులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన వెంట నడవాలనుకుంటున్నవాళ్లు రావొచ్చన్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు.. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ ఛైరమన్‌గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. ఆయన రాయచోటిలో 2012లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. సుబ్రహ్మణ్యం మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడు.. గత నెలలో పాలకొండ్రాయుడు మరణించిన సంగతి తెలిసిందే. 1978 ఎన్నికల్లో సుగవాసి పాలకొండ్రాయుడు రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో మళ్లీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలవగా.. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. గత 43 ఏళ్లుగా ఈ కుటుంబం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓడారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కనిపించారు. ఇంతలో కొంతకాలంగా రాజంపేట నియోజకవర్గంలో పరిణామాలతో టీడీపీకి రాజీనామా చేశారు.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.