యువ పేసర్ చిక్కుల్లో పడ్డారు. ఉత్తరప్రదేశ్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యశ్ దయాళ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఒక యువతి ఆరోపించింది. ఐదేళ్లుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తనను మోసం చేశాడని ఆమె యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌కు చెందిన బాధితురాలు తన ఫిర్యాదులో కొన్ని విషయాలు వెల్లడించింది. యశ్ దయాళ్‌తో తనకు గత ఐదేళ్లుగా సంబంధం ఉందని చెప్పింది. పెళ్లి పేరుతో తనను వాడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. యశ్ తన తల్లిదండ్రులకు, బంధువులకు తనను కోడలిగా పరిచయం చేశాడని, అందుకే అతడిని నమ్మానని చెప్పింది.తన వ‌ద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని బాధితురాలు తెలిపింది. మోసం చేశాడని నిలదీయడంతో తనపై భౌతిక దాడికి తెగబడ్డాడని ఆమె ఆరోపించింది. అంతేకాదు, మానసికంగానూ వేధించాడని బాధితురాలు చెప్పింది. యశ్ మోసానికి సంబంధించిన చాట్ రికార్డులు, స్క్రీన్‌షాట్లు, వీడియో కాల్స్, ఫొటోలు తన దగ్గర ఉన్నాయని తెలిపింది. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు యశ్ దయాళ్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆరోపించింది. గతంలో కూడా ఇలాగే ఇతర అమ్మాయిలను మోసం చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని ఫిర్యాదులో ఆమె పేర్కొంది.ఈ నెల 14న మహిళా హెల్ప్‌లైన్ 181కు ఫోన్ చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. దీంతో న్యాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు తెలిపింది. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్ (సీఓ)ను విచారణ చేయాలని ఆదేశించింది. ఐజీఆర్ఎస్ ద్వారా అందిన ఈ ఫిర్యాదును జులై 21లోగా పరిష్కరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు.ఇక, యశ్ దయాల్‌ ఇటీవల జరిగిన IPL 2025 టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 15 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీశాడు.