Guntur: సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపీడికి యత్నం.. దొంగల ముఠాపై రైల్వే పోలీసులు కాల్పులు

Wait 5 sec.

భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వస్తోన్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైల్లో దుండుగులు దోపిడీకి ప్రయత్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూపిడుగురాళ్ల స్టేషన్ సమీపంలో సిగ్నల్‌ను ట్యాంపరింగ్ చేసి రైల్లోకి ప్రవేశించిన గ్యాంగ్‌‌పై కాల్పుల జరిపారు. దీంతో దుండగులు రైలు నుంచి దూకి తప్పించుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠా రైల్లోకి ఎక్కినట్టు పోలీసులు తెలిపారు. బిహార్, మహారాష్ట్రలకు చెందిన ముఠాలు రైల్లో దోపిడీకి పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో న్యూపిడుగురాళ్ల స్టేషన్‌లో జరిగిన రెండో ఘటన ఇది. శనివారం తెల్లవారుజామున విశాఖ నుంచి చర్లపల్లికి వస్తోన్న స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును ఆపి.. లోపలికి ప్రవేశించి ప్రయాణికుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ దగ్గర సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. దీంతో రైలును లోకోపైలట్ ఆపవలసి వచ్చింది. ఆ తరువాత దొంగలు రెండు బోగీల్లోకి వెళ్లి మహిళల మెడల్లోని బంగారు గొలుసులు లాక్కొని పారిపోయారు.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సిగ్నల్‌ వ్యవస్థను ట్యాంపర్‌ చేయడం ద్వారా రైలును నిలిపివేశారు.. తెల్లవారుజామున 4.12 గంటల నుంచి 5.30 వరకు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’అని చెప్పారు. దొంగలు ఒక మహిళ దగ్గర 20 గ్రాముల గొలుసు, మరొక మహిళ దగ్గర 30 గ్రాముల గొలుసు దోచుకున్నారని తెలిపారు.సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి దొంగతనాలు చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఒంగోలు, రేణిగుంట, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల స్టేషన్ల పరిధిలో ఇదివరకే ఇలాంటి ఘటనలు జరిగాయి. మూడు రోజుల కిందట అనంతపురం జిల్లాలో చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపి మహిళ మెడలోంచి 2.7 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌కు చెందిన ముఠాలే ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్న రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.ఒకప్పుడు రైళ్లలో దొంగతనాలు రైలు క్రాసింగ్ కోసం ఆగినప్పుడు లేదా ప్రయాణికుల్లా నటిస్తూ చేసేవారు. స్టేషన్లలో రైళ్లు ఆగినప్పుడు కిటికీల నుంచి చేతులు పెట్టి ఆభరణాలు దొంగిలించేవారు. కానీ ఇప్పుడు సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్ చేసి రైళ్లు ఆపేసి దొంగతనాలు చేస్తున్నారు. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో షోలాపూర్ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్, మీర్జాపూర్ గ్యాంగ్‌లతో పాటు జామ్‌కేడ్, బీడ్‌ ప్రాంతాలకు చెందిన నేరస్థులు ఉన్నారని రైల్వే పోలీసులు గుర్తించారు.