టీ20 జట్టు కెప్టెన్ హాస్పిటల్ బెడ్‌పై ఉన్నాడు. సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. ఆపరేషన్ తర్వాత హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోని సూర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ యాదవ్.. ఆ జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. టీ20ల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న స్కై గత సీజన్‌లో వరుసగా 16 సార్లు 25కి పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ 2025లో 717 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా నాన్ ఓపెనర్ బ్యాటర్‌గా కూడా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా సూర్య రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ తర్వాత ముంబై టీ20 లీగ్‌లో ఆడిన సూర్యకుమార్ యాదవ్.. నేరుగా ఇంగ్లండ్ పయనమయ్యాడు. కొద్ది రోజులు ఇంగ్లండ్‌లో ఉండి ఆ తర్వాత ఆటగాళ్లు వచ్చే స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కోసం జర్మనీలోని మునిచ్ చేరుకున్నాడు. సర్జరీ విజయవంతంగా పూర్తవడంతో ప్రస్తుతం మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. సర్జరీ అనంతరం స్కై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను రికవరీ అవుతున్నానని, మళ్లీ త్వరలోనే బ్యాట్ పట్టుకుంటానంటూ పేర్కొన్నాడు.ఐపీఎల్ 2025 తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవగా.. సూర్య మాత్రం రెస్ట్ తీసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం కేవలం టీ20ల్లో మాత్రమే ఆడటం గమనార్హం. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత సూర్యకుమార్‌ని వన్డే జట్టుకు ఎంపిక చేయలేదు. టెస్టుల్లో కూడా సూర్యకి ఛాన్స్ దక్కలేదు. దాంతో కేవలం టీ20ల్లోనే ఆడుతూ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్ సమయానికి సూర్యకుమార్ యాదవ్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 26 నుంచి బంగ్లాదేశ్ వేదికగా టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ ఛాంపియన్స్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో సూర్యకుమార్ యాదవ్‌ని టీ20 కెప్టెన్‌గా నియమించారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లోనూ భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవే కొనసాగే అవకాశం ఉంది.