ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా చోటు చేసుకున్న మూడు భయంకరమైన ఘటనలు మానవ సంబంధాలలోని చీకటి కోణాలను, హింస తీవ్రతను కళ్ళకు కట్టాయి. ఈ సంఘటనలు స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా.. సామాజిక భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి. వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కుంటపల్లిలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా సతీష్ అనే కుమారుడు శనివారం తెల్లవారుజామున తన కన్నతల్లి వినోద (50) పై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనను గమనించిన స్థానికులు, బంధువులు వెంటనే వినోదను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి, 85 శాతం కాలిన గాయాలయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్నప్పటికీ, వినోద మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తన కొడుకు సతీషే ఈ దారుణానికి పాల్పడ్డాడని స్పష్టం చేసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆస్తి కోసం కన్నతల్లిని దారుణంగా హింసించిన ఈ ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సతీష్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక అమానుష ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఒక వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో.. కొందరు ఆమెను బంధించి, వివస్త్రను చేసి అత్యంత దారుణంగా హింసించారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో జీడి పోసి మానవత్వాన్ని మరిచిపోయేలా దాడి చేశారు. బాధితురాలు కన్నీళ్లతో వేడుకుంటున్నా వారు వదలలేదని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ములుగు మండలానికి చెందిన ఈ యువతికి పదేళ్ల క్రితం వివాహమై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త, ఒక బంధువైన వివాహితతో కలిసి పది రోజుల క్రితం వెళ్ళిపోవడంతో, ఈ ఘటనకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం. అంతేకాకుండా.. హనుమకొండ జిల్లా కాజీపేటలో ఒక ఆర్థిక వివాదం దారుణ హత్యకు దారితీసింది. రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న 38 ఏళ్ల నవీన్ కుమార్ను అదే ప్రాంతానికి చెందిన గడ్డం ప్రవీణ్ కుమార్ కత్తితో పొడిచి చంపాడు. సుమారు రూ.40,000 నగదు విషయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది ఉద్రిక్తతకు దారితీసింది. ప్రవీణ్ చేతిలో ఉన్న కత్తితో నవీన్‌పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. నవీన్ భార్య మాధవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ వరుస ఘటనలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న హింసాత్మక ధోరణులను, మానవ సంబంధాల విలువలు దిగజారుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయి. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ప్రాణాలను బలిగొంటున్నాయి. సమాజంలో నైతిక విలువలు, శాంతిభద్రతల పట్ల ప్రజల్లో అవగాహన లోపిస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులు ఈ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షించడం ద్వారా నేరాలను అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి సామాజికంగా, మానసికంగా కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజల్లో చట్టం పట్ల గౌరవం, మానవత్వం పట్ల స్పృహ పెరగాలి.