సింధు జలాల నిలిపివేత తర్వాత పాక్‌కు భారత్ మరో షాక్.. తుల్‌బుల్‌ ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్

Wait 5 sec.

తరచూ కవ్వింపులకు గురి చేస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు బలితీసుకున్న పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టేందుకు దశాబ్దాల నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని మోదీ సర్కార్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ఎడారిలా మారే పరిస్థితి నెలకొంది. తమ గడ్డపై ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే సింధు నదీ జలాలను పాకిస్తాన్‌కు వెళ్లకుండా అడ్డుకున్న భారత్.. వాటిని వినియోగించుకునేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమం వైపు ప్రవహిస్తున్న నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన తుల్‌బుల్‌ నావిగేషన్‌ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు కేంద్రం దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఈ తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ తుది దశలో ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ సిద్ధం అవుతోందని.. సంవత్సరం లోగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ నదుల వాటాను మరింత సద్వినియోగం చేసుకునేందుకు అనేక ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని సంబంధిత అధికారి ఒకరు స్పష్టం చేశారు. పశ్చిమ దిశగా ప్రవహించే నదుల్లో ఒకదాని నుంచి నీటిని పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు మళ్లించే అవకాశం కూడా పరిశీలనలో ఉందని తెలిపారు.సింధు జలాల ఒప్పందం, భారత్‌కు సవాళ్లు1960 సెప్టెంబరు 19వ తేదీన భారత్, పాక్‌ల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం.. పశ్చిమ దిశగా పాకిస్తాన్ వైపు ప్రవహించే సింధూ నదితోపాటు చీనాబ్‌, జీలం వంటి ప్రధాన ఉప నదులపై భారత్‌కు తక్కువ అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఈ నదీ వ్యవస్థ.. మొత్తం నీటిలో 20 శాతం భారత్, 80 శాతం పాకిస్తాన్ వినియోగించుకోవాలని తీర్మానించారు. అయితే మన దేశంలో ఈ నదుల నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం.. భారత్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. వేసవి కాలంలో కొంతమేరకు నిల్వ చేస్తున్నప్పటికీ.. వర్షాకాలంలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటంతో అధిక నీరు దిగువన ఉన్న పాకిస్తాన్‌కే ప్రవహిస్తోందని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా సింధు జలాల ఒప్పందం అమలు వల్ల వరదలు వచ్చిన సమయాల్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యేవని.. కానీ ప్రస్తుతం రిజర్వాయర్ నిర్వహణపై ప్రముఖంగా దృష్టి సారించినట్లు తెలిపారు. గతంలో పాక్ తీవ్రంగా వ్యతిరేకించిన కిషన్‌గంగా ప్రాజెక్టు ఇప్పటికే పూర్తికాగా.. రాట్లే ప్రాజెక్టు నిర్మాణం కూడా ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.