తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడి నియామకంపై పార్టీలో అంతర్గత వర్గపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో.. గోషామహల్ ఎమ్మెల్యే చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోందని.. అయితే ఈ పదవికి బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం’ వాటిల్లుతుందని ఆయన హైకమాండ్‌ను పరోక్షంగా హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును అధిష్టానం ఖరారు చేసిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో కూడా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తనకు అవకాశం లభిస్తే, పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని, గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతానని హామీ ఇచ్చారు. బీజేపీ అవసరాన్ని గడపగడపకు చాటిచెబుతానని, ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా తెలిపారు. అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పేర్కొంటూనే, ‘వీఐపీలా ఉండే వారు కాకుండా.. హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తినే నియమిస్తే బాగుంటుంది’ అని పరోక్షంగా అధిష్టానానికి సూచించారు. ‘రాజాసింగ్ అధ్యక్షుడు కావొద్దని అడ్డుకునే ఒక బృందం పనిచేస్తోంది’ అంటూ ఆయన పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో నెలకొన్న కోల్డ్ వార్‌ను స్పష్టం చేస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావన వ్యక్తమవుతోంది. నాయకత్వ నియామక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. రాజాసింగ్ వంటి బలమైన హిందూత్వ వాది, ప్రజాదరణ ఉన్న నాయకుడి డిమాండ్లను అధిష్టానం ఎలా స్వీకరిస్తుంది.. పార్టీలో ఐక్యతను ఎలా సాధిస్తుంది అనేది చూడాలి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే.. అందరినీ కలుపుకొని పోయే నాయకత్వం, స్పష్టమైన వ్యూహం అవసరం.