హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 36మందికి చనిపోయారని.. శిథిలాల కింద కార్మికులు చిక్కుకుని ఉంటారని తెలిపారు. అలాగే కొంతమంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదన్నారు. పాశమైలారం ప్రమాదం జరిగిన సమయంలో ఘటన జరిగిన సమయంలో.. సిగాచీ కంపెనీలో పనిచేస్తోన్న కడప జిల్లాకు చెందిన దంపతుల ఆచూకీ దొరకలేదు. వారిద్దరు కనిపించడం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ జంటకు నెల క్రితమే వివాహమైంది.కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేశారు.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పుట్రేలకు చెందిన శ్రీ రమ్య MSC పూర్తి చేశారు. ఇద్దరికి సిగాచీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరికి ఆ కంపెనీలో పరిచయం ఏర్పడింది.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాల్లో పెద్దలు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరు నెల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నిఖిల్, శ్రీ రమ్య తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును కలిసి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంటనే ఇరు కుటుంబాల్లో పెద్దల్ని పిలిచి మాట్లాడి ఒప్పించారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఆషాఢమాసం తర్వాత వేడుక ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇటీవల నిఖిల్, శ్రీ రమయ్య జంట హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లింది. ఎమ్మెల్యేను ఆషాఢం తర్వాత జరిగే వేడుకకు రావాలని ఆహ్వానించింది. ఎమ్మెల్యే కొలికపూడి కూడా వారిద్దరికీ బట్టలు పెట్టి దీవించి పంపించారు. అయితే సోమవారం సిగాచీ కంపెనీలో ప్రమాదం జరిగిందని తెలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెంటనే నిఖిల్ రెడ్డికి ఫోన్ చేయగా స్పందించలేదు.. అలాగే శ్రీ రమ్యకు కాల్ చేశారు.. కానీ ఇద్దరి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో అనుమానం వచ్చింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కంపెనీ దగ్గరకు వెళ్లి అధికారుల్ని కలిసి ఈ దంపతుల గురించి ఆరా తీశారు.. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు విధుల్లో ఉన్టనట్లు తేలింది. ఫస్ట్‌ ఫ్లోర్‌లో రమ్య విధుల్లో ఉన్నారని.. స్లాబ్ కిందపడి చనిపోయారని అక్కడి వారు చెప్పినట్లు సమాచారం. నిఖిల్ రెడ్డి ఈ ప్రమాదంలో మంటలు చెలరేగగా.. పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలియడంతో ఇరువురి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వారిని ఓదార్చారు.. నిఖిల్, రమ్యలను సంతోషంగా ఉంటే చూడాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి.