పాశమైలారం ప్రమాదం.. 33కి చేరిన మృతుల సంఖ్య.. ఐదుగురి ఆచూకీ గల్లంతు

Wait 5 sec.

కెమికల్ ప్లాంట్‌లో చోటు చేసుకున్న ప్రమాదం ధాటికి యావత్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 33 మంది చనిపోయారని తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరో ఐదుగురి ఆచుకీ తెలియడం లేదు. ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సిగాచి కెమికల్ ప్లాంట్‌లో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ఈప్రమాదం జరిగింది.ప్రమాద తీవ్రతకు కెమికల్ ప్లాంట్ ఉన్న బిల్డింగ్‌లోని 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్‌బీమ్‌లు సైతం విరిగి కుప్పకూలిపోయాయి. దీంతో ప్రాణ నష్టం భారీ స్థాయిలో పెరిగిందని అధికారులు వెల్లడించారు. పేలుడు జరిగే సమయంలో అక్కడే ఉన్న కెమికల్ ప్లాంట్ వైస్‌ ప్రెసిడెంట్‌ డెడ్‌బాడీ 50 మీటర్ల దూరం వరకు ఎగిరి పడిందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి సహాయక చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, వివేక్‌ల ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. సంగారెడ్డి కలెక్టర్, ఉన్నతాధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచీ సంస్థకు తెలంగాణలోని పాశమైలారంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడ మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే మెడిసిన్‌ను తయారు చేసి.. ఔషధ తయారీ సంస్థలకు అమ్ముతుంటారు. ఈ పరిశ్రమలో మొత్తం 4 బ్లాకులున్నాయి. ఈ క్రమంలో సెక్యూరిటీ బ్లాక్‌ వెనకవైపుగా ఉన్న ప్రొడక్షన్ విభాగంలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌‌ తయారీ జరుగుతుంది. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పని చేస్తుంటారు. ఎప్పటిలానే సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా తమ విధులకు హాజరయ్యారు. పనిలో భాగంగా ముడి సరకును శుద్ధి చేసేందుకు స్ప్రేయర్‌ డ్రయ్యర్‌ను ఉపయోగించారు. ఈక్రమంలో అది సోమవారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే పైఅంతస్తు కూలిపోయింది.. దాని పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో 147 మంది అక్కడే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వారిలో ప్రమాదస్థలంలోనే సుమారు 17 మంది చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటివరకు 33 మృతదేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పేలుడు జరిగిన సమయంలో ఏకంగా 700-800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడే పనిచేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు.