ఇంగ్లీష్ జట్టును ఓడించిన ఇంగ్లిస్‌.. ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా రికార్డు ఛేజింగ్‌!

Wait 5 sec.

ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎలా ఆడినా.. ఐసీసీ టోర్నీలో అదరగొట్టే ఆస్ట్రేలియా మరోసారి అదే పని చేసింది. గత నాలుగు వన్డేల్లో వరుసగా ఓటమి పాలైన ఆసీస్.. శనివారం ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో రికార్డు ఛేజింగ్ చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 352 పరుగులను విజయవంతంగా ఛేజ్ చేసింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఘనంగా బోణీ కొట్టింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫస్టు బ్యాటింగ్‌లో అయినా.. ఛేజింగ్‌లో అయినా ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్‌తో వన్డే సిరీస్‌లో దారుణ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయింది. ఏకంగా 351/8 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులోని ప్రధాన బౌలర్లు గాయాలతో టోర్నీకి దూరంకాగా.. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ మ్యాచ్ ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా ఇంగ్లాండ్ అవతరించింది. బెన్ డకెట్ర్‌ 143 బంతుల్లో 165 రన్స్‌తో టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. టోర్నీ చరిత్రలో రికార్డు స్కోరు చేసిన ఇంగ్లాండ్ విజయంపై ధీమాగా ఉంది. అనుకున్నట్లుగానే ఆ జట్టు బౌలర్లు విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ (6), స్టీవ్ స్మిత్‌ (5)లను త్వరగా పెవిలియన్‌కు పంపించారు. దీంతో 27 పరుగులకే ఆసీస్ 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లాండ్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఆఖరి వరకూ పోరాడే అలవాటు ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లోనూ అదే చేసింది. జోష్ ఇంగ్లిస్ (86 బంతుల్లో 120* రన్స్‌) సెంచరీకి తోడు.. మాథ్యూ షార్ట్ (63), అలెక్స్ కేరీ (69), మార్నస్ లబుషేన్ (47), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15 బంతుల్లో 32 రన్స్‌) మెరవడంతో ఆ జట్టు 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐసీసీ టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరును ఛేజ్ చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది.