అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం విచారం వ్యక్తం చేశారు. మహా శివరాత్రి పండుగ వేళ.. గుండాల కోన శివాలయానికి వెళ్ళిన ముగ్గురు భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం పాలవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి దుర్ఘటనలు మరోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉండే ఆలయాలకు వెళ్ళే భక్తుల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను పవన్ ఆదేశించారు. ఇందుకోసం పోలీసు, దేవాదాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. గుండాల కోన దుర్ఘటన నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్.. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, వన్యప్రాణి సంరక్షణ అధికారులతో డిప్యూటీ సీఎం పలు అంశాలపై చర్చించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలలో ఉండే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి రక్షణ కల్పించాలని సూచించారు. కర్ణాటకలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారన్న పవన్ కళ్యాణ్.. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాలను, విధానాలను పరిశీలించి అమలు చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రైల్వే లైన్ బారికేడింగ్ చేయాలని సూచించారు. అలాగే ఏనుగుల కదలికను ట్రాక్ చేయడానికి రేడియో కాలరింగ్‌ ఏర్పాటు చేయాలని.. అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. స్థానికంగా ఉండేవారితో పాటుగా అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్ళే భక్తులకు ఏనుగుల ప్రవర్తన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతాపరమైన చర్యల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మనుషుల భద్రతతో పాటుగా వన్యప్రాణుల సంరక్షణను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిష్కార మార్గాలను కనుగొనాలని.. వాటితో నివేదిక తయారుచేసి సమర్పించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.