పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం డిసైడ్ అయింది. ఈ నెల 26న మహా శివరాత్రి కాగా.. 24 నుంచి 28వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.ప్రధానంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పింది. ఈ నెల 24 నుంచి 27 తేది వరకు (నాలుగు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయంది. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 తేది వరకు (మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని, టికెట్ల బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చునని అన్నారు. మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.