రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ లేఅవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. LRSపై తాజాగా మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌కు 200 మీటర్ల పరిధిలోని, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహాయించి మిగతా సర్వే నంబర్లలోని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు ఆటోమేటెడ్‌గా ఫీజు ఖరారు చేయనుంది. ఈ ఏడాది మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుతో పాటు ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు చెల్లిస్తే ప్రభుత్వం నుంచి 25 శాతం రాయితీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారం, ఫీజు రాయితీ నేపథ్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఇవీ మార్గదర్శకాలు.. చెరువులు, నీటివనరుల వద్ద ఎఫ్‌టీఎల్‌ పరిధి నుంచి 200 మీటర్ల పరిధిలోని భూములను సర్వే నంబర్ల వారీగా గుర్తించి వాటిని సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేయాలి. ఈ సర్వే నంబర్లలోని దరఖాస్తుల్ని క్షేత్రస్థాయి పరిశీలన కోసం నీటిపారుదల, రెవెన్యూశాఖలకు పంపించాలి.ఎఫ్‌టీఎల్‌ నుంచి 200 మీటర్ల పరిధిలోని, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహాయించి మిగతా భూముల దరఖాస్తులను పట్టణాల్లో మున్సిపల్‌ గ్రామాల్లో పంచాయతీ అధికారులు పరిశీలించాలి. ఇరిగేషన్, రెవెన్యూశాఖలకు సిఫార్సు చేసిన అఫ్లికేషన్లపై ఆయా శాఖల అధికారుల సిఫార్సుల ఆధారంగా మున్సిపల్‌/పంచాయతీ అధికారులు తదుపరి ప్రక్రియ చేపట్టాలి.ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ల జాబితాను సిద్ధం చేసి సీజీజీకి పంపించాలి. ఈ సర్వే నంబర్లలోని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలనకు రెవెన్యూ శాఖకు పంపించాలి.జీవో 28 ప్రకారం మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది. ఫీజు చెల్లించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అఫ్లికేషన్లు ప్రాసెస్‌ చేస్తారు. ప్లాటు జీవో నిబంధనలకు లోబడి ఉంటేనే క్రమబద్ధీకరణకు ప్రొసీడింగ్స్‌ ఇస్తారు. లేదంటే తిరస్కరించడంతో పాటు ఫీజులో పదిశాతం ప్రాసెసింగ్‌ కింద మినహాయించి, మిగతాది రిటర్న్ చేస్తారు.భారీగా అఫ్లికేషన్లు.. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల్లో కలిపి మెుత్తం 25.68 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇందులో చెరువులు, ప్రభుత్వ భూములు, ఎఫ్ టీఎల్ పరిధిలో ఎక్కువ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ కోసం వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 13,300 అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని చెప్పారు. వాటిలో 6 లక్షలకు పైగా అమ్ముడవని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.