ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల పనులు వేగవంతం అయ్యాయి.. ముఖ్యంగా నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ పనులపై ఫోకస్ పెట్టారు అధికారులు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రైల్వే లైన్ పనుల్లో స్పీడ్ పెంచారు. ముఖ్యంగా దర్శి రైల్వే స్టేషన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్‌లో మెయిన్ ట్రాక్‌ పూర్తి చేశారు.. లూప్‌లైన్, మూడు ట్రాక్‌ల పనులు చేపట్టారు. ఈ పనుల్ని పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు అధికారులు. ముఖ్యంగా దర్శి రైల్వే స్టేషన్‌ పనులు వేగవంతం చేశారు. అక్కడ అధికారుల కోసం గెస్ట్‌హౌస్, టికెట్‌ కౌంటర్, సిగ్నల్‌ కార్యాలయం పనులు పూర్తి చేశారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు కూర్చొనేందుకు బల్లలు, తాగునీరు, టాప్‌లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ లోపల, బయట లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే గ్రీనరీ కోసం మొక్కలు కూడా ఏర్పాటు చేశారు.. ఒక్క మాటలో చెప్పాలంటే పనులు దాదాపు 90శాతం పూర్తయ్యాయి. మార్చి నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తవుతాయంటున్నారు అధికారులు. అయితే ఇప్పటికే అధికారులు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లతో ట్రయల్‌ రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు కొత్త రైల్వే లైన్‌ను మొత్తం ఐదు దశల్లో 309 కిలోమీటర్ల పరిధిలో చేపట్టారు. 3,4 దశల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దర్శి వరకు ట్రాక్ పనులు, రైల్వే స్టేషన్ పనులు దాదాపు ముగింపు దశకు వస్తుండగా.. పొదిలి సమీపంలో ట్రాక్ పనులు 200 మీటర్ల పరిధిలో తప్ప మిగిలింది పూర్తయ్యింది. ఈ ట్రాక్‌ నిర్మాణం 145 కి.మీ గార్లపేట వరకు కొలిక్కి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పొదిలిలో 70శాతం, కనిగిరిలో 80శాతం ట్రాక్‌, స్టేషన్లు సహా పనులు పూర్తి చేశారు.ఆ పక్కనే ఉన్న గౌతువారిపల్లిలో 70 శాతం, గార్లపేటలో 60 శాతం రైల్వే స్టేషన్ల నిర్మాణం పూర్తయ్యింది.అయితే ఈ రైల్వే లైన్‌కు సంబంధించి.. పేరంగడిపల్లి దగ్గర నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక అక్కడ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు కనిగిరి-పామూరు మధ్యలో పనుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం మీద నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దర్శివాసుల రైలు కల నిజం కాబోతోంది. అప్పటి నుంచి రైళ్లు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉండేవారి కల నెరవేరబోతోంది.