ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల సినీ నిర్మాత కేదార్ నాథ్ దుబాయ్‌లో గుండెపోటుతో మరణించగా.. అతడి మరణాన్ని కేటీఆర్‌కు లింకు చేస్తూ సన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేదార్ నాథ్ బిజినెస్ పార్ట్‌నర్ అని.. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. అలాంటి కేదార్‌నాథ్‌ దుబాయ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందితే కేటీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదో, ఎందుకు విచారణ కోరడం లేదో చెప్పాలని డిమాండ్ చేసారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే డ్రగ్స్‌ కేసు విచారణకు రానున్న సమయంలో కేదార్‌నాథ్ మరణం చోటుచేసుకుందన్నారు. కేదార్‌ మృతి చెందిన సమయంలోనే ఓ మాజీ ఎమ్మెల్యే కూడా దుబాయ్‌లో ఉన్నారని సంచనల కామెంట్స్ చేశారు. ఆ ఎమ్మెల్యే ఎవరు? అని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని హైకోర్టుల ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురైనట్లు చెప్పారు. ఆ కేసును వాదిస్తున్న న్యాయవాది సంజీవరెడ్డి ఇప్పుడు కేదార్‌నాథ్‌ మరణాలన్నీ మిస్టరీగానే ఉన్నాయని అన్నారు. అయినా వీటిలో ఏ ఒక్కదానిపైనా కేటీఆర్‌ విచారణకు డిమాండ్‌ చేయటం లేదని చెప్పారు. వీరి మరణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు. ఇక ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపైనా సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. ప్రమాదానికి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌లో టెక్నికల్ సమస్య వస్తే.. గత 9 ఏళ్లుగా అలాగే వదిలేశారన్నారు. మిషన్ రిపేర్ చేయించి ఇప్పుడే పనులు మొదలు పెట్టామన్నారు. ఇన్నేళ్లుగా యంత్రాలను అలాగే వదిలేయడంవల్ల పైనుంచి సీపేజ్‌ చేరి మట్టి భాగం మెత్తబడిపోయిందన్నారు. ఇప్పుడు తవ్వడం మొదలుపెట్టగానే టన్నెల్ పైకప్పు కూలిపోయిందన్నారు. కాంగ్రెస్‌కు తప్ప తనకు పేరు రాదన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా ఇందులో పెద్దగా కమీషన్లు కూడా రావన్నది మరో ఉద్దేశం కావొచ్చునని అన్నారు. కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.