తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 26న ఈ పథకం ప్రారంభం కాగా.. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు నాలుగు విడతల్లో ఇవ్వనున్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే అన్ని జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ ఖర్చును సాధ్యమైనంత తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మేస్త్రీలకు శిక్షణ ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ డిసైడ్ అయింది. తొలి విడతలో మంజూరు చేసిన 72,045 ఇళ్లను సత్వరం నిర్మించి పూర్తి చేయడానికి ఇండ్ల నిర్మాణంలో గట్టితనం, నాణ్యత ఉండేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం. వ్యయాన్ని తగ్గించడం. ఇంటి నిర్మాణ సామగ్రి వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవడం, భద్రత తదితర అంశాలపై మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణలోని 12,672 గ్రామాల నుంచి ఒక్కో మేస్త్రీని ఎంపిక చేసి వారికి ఇళ్ల నిర్మాణంపై ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో 82 మంది మేస్త్రీలకు మొదటి బృందంలో ట్రైనింగ్ పూర్తిచేశారు. మొదటి విడతలో నిర్మించే గ్రామాలకు ఈ మేస్త్రీలను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేదలపై భారం పడకుండా.. ఒక్కో ఇంటికి కావాల్సిన 8 ట్రాక్టర్ల ఇసుకను ఫ్రీగా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఉపాధి కల్పించేలా ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి సరఫరా చేయడానికి కూడా అధికారులు చర్యలు చేపట్టారు. 400 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియాతో ఇంటిని నిర్మించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం మూడు నమూనాలను సర్కార్ విడుదల చేసింది. తాజాగా.. ఇండ్లు నిర్మించే మేస్త్రీలకు ట్రైనింగ్ ఇచ్చే అంశంపై గృహ నిర్మాణ శాఖ దృష్టిసారించింది.