ఆంధ్రప్రదేశ్ పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పోసాని అరెస్టు సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు కనిపించాయి.. పోలీసులు వచ్చిన సమయంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్ రాయదుర్గం పోలీసుల్ని కలిశారు.. వారి సహకారంతో పోసోని ఇంటికి వెళ్లారు. ఏపీ పోలీసుల ఎంట్రీతో పోసాని ఒకింత షాకయ్యారు. తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని.. అక్కడ నమోదైన కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని చెప్పారు. పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 'మీరెవరో నాకు తెలీదు. నేను మీతో ఎందుకు రావాలి' అంటూ ప్రశ్నించారు. 'నాకు ఆరోగ్యం సరిగా లేదు.. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి.. నోటీసులు ఇస్తే కాస్త కోలుకున్న తర్వాత పోలీసుల విచారణ వస్తాను' అన్నారు. 'మేము చట్టప్రకారమే అరెస్ట్ చేయడానికి వచ్చాము.. సహకరించండి' అని పోలీసులు కూడా పోసానిని కోరారు. అప్పుడు 'మీరు మా ఇంట్లోకి ఎలా వస్తారు' అని పోసాని ప్రశ్నించారు. 'మేం అరెస్ట్ చేయాలంటే ఎక్కడికైనా వస్తాం'అంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు, పోసాని మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్‌ చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇస్తుండగా.. పోసాని తీసుకోలేదు. ఆ తర్వాత పోసానిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి.. ఆయన భార్యకు నోటీసులు ఇవ్వబోయారు. అయితే ఆ నోటీసులపై సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు. అయితే చివరికి నోటీసు ఇచ్చి ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకెళ్లారు. ఆయన్ను ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. అనంతరం రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పోసానికి ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌‌గా పదవి దక్కింది. అయితే ఆయన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటుగా మరికొందరు నేతలపై కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానిపై పలు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయగా.. వరుసగా కేసులు నమోదయ్యాయి.పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. పోసానిపై బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద నమోదైన కేసులో తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే సమ్మెపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా పోసానిపై మరో కేసు నమోదైనట్లు చెబుతున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పోసాని మీడియా మందుకు వచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఇక జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పిన సంగతి తెలిసిందే.పోసాని అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ మహిళా నేత శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సమయం లేదు సందర్బం అసలే లేదు రేపటి డేట్ తో ఇవ్వాళా అరెస్ట్ అనే సోయి అసలే లేదు ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు హామీలు అమలు చెయ్యడం చేతగాని పెద్ద మనుషులు అక్రమ అరెస్టులతో కక్ష్యపూరిత రాజకీయాలకు తెరలేపారు శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని గారి అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం' అని మండిపడ్డారు.పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివికావని.. రాజకీయాలనుంచి దూరంగా వెళ్తున్నాని పోసాని ఎప్పుడో ప్రకటించారన్నారు. అయినా ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారని.. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మర్చిపోవద్దన్నారు. బ్రిటిష్‌ పాలనలో స్వేచ్ఛగా ఉన్నావేమోనన్న భావన ప్రజలకు వస్తోందన్నారు. చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. పోసాని అరెస్టుతో ప్రభుత్వం అరాచకం తీవ్రస్థాయికి చేరినట్టైందని.. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవన్నారు. కచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారని.. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నామన్నారు. పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.