ఆ ఒక్క భాషే 25 ఉత్తరాధి భాషలను మింగేసింది.. ఏవేవంటే?: సీఎం ఎంకే స్టాలిన్

Wait 5 sec.

CM MK : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు.. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అంతా త్రిభాషా విధానాన్ని పాటించాలని ఇటీవలే ప్రకటించింది. దీన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం సాగుతోంది. ఈక్రమంలోనే తాజాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఒక్క హిందీ భాష వల్ల ఉత్తర భారత దేశంలోని 25 భాషలు పూర్తిగా కనుమరుగు అయ్యాయని.. తమ రాష్ట్రానికి, భాషకు ఆ పరిస్థితి రానివ్వనని వివరించారు. అంతేకాకుండా ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అంతా హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటు ఓ స్థానిక బాషను నేర్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విద్యా విధానాన్ని తీసుకు వచ్చింది. జాతీయ విద్యా విధానంలో భాగమైన ఈ సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని వివరించింది. అయితే దీన్ని తమిళనాడు సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చాలా రోజులుగా తాము ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేయమంటూనే.. బలంవంతంగా ఇతర భాషలు నేర్చుకోవాలని ఇబ్బంది పెట్టొదంటూ సూచిస్తోంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం విద్యార్థులు అన్ని భాషలు నేర్చుకోవాలని.. అదే మంచిదని చెబుతోంది. ఇలా ఈ రెండు ప్రభుత్వాల మధ్య చాలా రోజులుగా మాటల యుద్ధం జరుగుతుండగా.. తాజాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిపై స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెడుతూ.. హిందీ భాష ఉత్తర భారత దేశంలో ఉన్న 25 భాషలు పూర్తిగా కనుమరుగు అయ్యాయని వివరించారు. ఇతర రాష్ట్రాల సోదర, సోదరీమణులారా.. హిందీ కారణంగా ఎన్ని భారతీయ భాషలు కనుమరుగయ్యాయో ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. 100 ఏళ్లలో ఉత్తర భారతంలో మొత్తంగా 25 భాషలను హిందీ పూర్తిగా నాశనం చేసిందన్నారు. భోజ్‌పురి, మైథిలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురు చూస్తున్నాయని సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్‌లు హిందీ రాష్ట్రాలు కావని.. వాటి అసలు భాషలు గతంలోనే కలిసిపోయాయన్నారు. తమిళనాడు రాష్ట్రానికి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ త్రిభాషా విధానాన్ని అంగీకరించడం లేదన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే తాము కేంద్ర ప్రభుత్వంపై ప్రతిఘటిస్తూనే ఉంటామన్నారు. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారని వివరించారు. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం.. తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న అనేక మంది నేతలు హిందీ బడులు నడిపిస్తున్నారని వివరించారు. సీఎం ఎంకే స్టాలిన్ కుటుంబ సభ్యులు కూడా పలు పాఠశాలలను నిర్వహిస్తున్నారని.. అందులో హిందీ, ఉర్దూ భాషలు మూడో భాషగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఈయన చెప్పే మాటలు నమ్మొద్దు అంటూనే కామెంట్లు చేస్తున్నారు.