: కొంతకాలంగా ఇన్ఫోసిస్‌కు ఏదీ పెద్దగా కలిసిరావట్లేదు. ముందుగా ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. దేశంలో యువత పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. వారంలో 70 గంటలు పనిచేయాలని ఆయన అన్నారు. తర్వాత.. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫీపై సంచలన ఆరోపణలు చేసింది. తమ వ్యాపార రహస్యాలు దొంగిలించిందని అమెరికాలో కోర్టులో దావా వేసింది. ఈ వివాదం కొనసాగుతున్న తరుణంలోనే ఇటీవల ట్రైనీలను బలవంతంగా తొలగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీ ఉద్యోగుల్ని విధుల్లో నుంచి తొలగించడం వివాదాస్పదం అయింది. ఈ వ్యవహారంపై దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కార్మిక శాఖ జోక్యం చేసుకోవాలని ఐటీ ఉద్యోగుల సమాఖ్య (NITES) డిమాండ్ చేస్తోంది. తాజాగా ఈ పంచాయతీ.. ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరుకుంది. బలవంతపు లేఆఫ్స్‌పై సదరు ట్రైనీలు.. పీఎంఓకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల్ని ఉటంకిస్తూ జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఈ ఇన్ఫీ తొలగింపులపై పీఎంఓలో దాదాపు 100 కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఆ కథనాల్లో ఉంది. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకొని తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలని.. భవిష్యత్తులో కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ట్రైనీలు కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే దీనిపై కేంద్ర కార్మిక శాఖ స్పందించి చర్యలు కూడా చేపట్టినట్లు తెలిసింది. కర్ణాటక కార్మిక శాఖకు ఫిబ్రవరి 25న నోటీసులు పంపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు.. దర్యాప్తు చేసి కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల ఆరంభంలోనే కర్ణాటక మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 400 మంది వరకు ట్రైనీలకు ఇన్ఫీ లేఆఫ్స్ ప్రకటించింది. తక్షణమే క్యాంపస్ వీడాలని ఆల్టిమేటం జారీ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇన్ఫోసిస్ కొద్ది రోజులకు దీనిపై స్పందించింది. వరుసగా 3 అసెస్‌మెంట్ టెస్టుల్లో ఫెయిల్ అయితే వారిని తొలగిస్తామని.. అదే జరిగిందని తెలిపింది. సంస్థ నిబంధనల్లో ఈ పరీక్షలు భాగంగా ఉన్నాయని.. కంపెనీ పురోగతికి కూడా అది కీలకం అని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరం రిక్రూట్‌మెంట్లో భాగంగా 2 వేల మంది ఫ్రెషర్లను ఇన్ఫీ ఎంపిక చేసింది. అదే ఏడాది ఆఫర్ లెటర్స్ ఇచ్చినా.. వీరిని విధుల్లోకి తీసుకోవడంలో జాప్యం చేసింది. ఈ క్రమంలోనే కంపెనీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కార్మిక శాఖ దగ్గర ఫిర్యాదు కూడా నమోదైంది. ఇక ఒత్తిడిని తట్టుకోలేక రెండేళ్లు ఆలస్యంగా అంటే 2024 ఏప్రిల్ నెలలో ఉద్యోగాల్లోకి తీసుకుంది. అయితే.. అప్పుడు మైసూర్ క్యాంపస్‌లో చేరిన వారిలో దాదాపు సగం మందిని ఇన్ఫోసిస్ తాజా లేఆఫ్స్‌లో తొలగించిట్లు తెలిసింది.