చాలా మంది యువత కలల కొలువు ఐటీ ఉద్యోగం. ఐదంకెల జీతం, వారానికి రెండ్రోజులు వీకాఫ్, కార్పొరేట్ వర్క్ కల్చర్, హైఫై లఫ్. అబ్బో.. ఇలా చెప్పుకుంటే పోతే ఐటీ ఉద్యోగుల లైఫ్ స్టైల్ మాములుగా ఉండదు. అందుకే చాలా మంది ఐటీ ఉద్యోగాలు చేసేందుకు పోటీ పడుతుంటారు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. కాయిన్ మరో వైపు తిప్పి చూస్తే కానీ తెలియదు.. ఐటీ ఉద్యోగులకు ఉండే వర్క్ ఫ్రెజర్, నైట్ షిప్టులు, జీవనశైలిలో మార్పులు. వీటి కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎంతలా అంటే.. దేశంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో 54 లక్షల మంది పని చేస్తుండగా.. వారిలో 84% మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలింది. మరో 71 శాతం మందిని ఊబకాయం, 34 శాతం మంది షుగర్, బీపీ తదితర సమస్యల బారిన పడే ప్రమాదంలో ఉన్నారు. స్కాలర్లు, ఓ ప్రైవేట్ హాస్పిటల్ చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ ఉద్యోగులు తీసుకునే ఫుడ్‌లో అధిక క్యాలరీలతో పాటు కూల్ డ్రింక్స్, శారీరక శ్రమ లేకపోవడంతోనే ఊబకాయం, కాలేయ జబ్బులు పెరుగుతున్నాయని గుర్తించారు. వారి జీర్ణక్రియ సక్రమంగా లేకపోవడంతో కాలేయ జబ్బులొస్తున్నాయని గుర్తించారు. జూన్‌ 2023 నుంచి జూన్‌ 2024 వరకు 3,450 మందికి వైద్య పరీక్షలు చేయించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. హెల్త్ చెకప్ చేయించుకున్న ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మంది ఊబకాయం, ఫ్యాటీలివర్‌తో బాధపడుతున్నారు. మరో 5 శాతం మందికి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయింది. 71 శాతం మంది యువకుల్లోనూ ఊబకాయం ఎక్కువగా ఉందని తేలింది. 34 శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో జీర్ణక్రియ అపసవ్యంగా ఉందని గుర్తించారు. ఆహారం తక్కువగా తీసుకుంటున్నా.. వీరిలో చాలా మందిని అజీర్తి సమస్య వేధిస్తోంది. దీనికి అదనంగా 10 శాతం మంది షుగర్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడి, పనివేళలు, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, నిద్రలేమి తదికర కారణాల వల్ల ఐటీ ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నట్లు తేలింది. ఇలా అయితే కష్టమేనని.. ఐటీ ఉద్యోగులు కాస్తంత శరీరాక శ్రమ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.