ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు వరుస వైఫల్యాలు చెందడంతో ఆ దేశం అట్టుడుకుతోంది. క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు పాక్ ప్లేయర్లను విమర్శలతో ఏకి పారేస్తున్నారు. ఇప్పుడు ఇది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. పాకిస్తాన్‌లో క్రికెట్ పతనమయ్యే స్థితిలో ఉందని పాక్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ అంటే.. ఇదంతా ఇమ్రాన్ ఖాన్ వల్లే అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ దుయ్యబట్టాడు. దాంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్లేయర్లకు అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ప్రదర్శన నిరాశకు గురిచేసిందని 1992 వరల్డ్ కప్ విన్నర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారని ఆయన సోదరి అలీమా అక్కడి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆటతీరుపై సంతృప్తిగా లేరని, క్రికెట్ రాజకీయం అయిన తర్వాత మరింత దారుణంగా మారిందని ఇమ్రాన్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి స్పందించాడు. పాకిస్తాన్ క్రికెట్ ఈరోజు ఇలా ఉండటానికి కారణం ఇమ్రాన్ ఖానే అంటూ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాడు. జింబాబ్వే జట్టుతో సమానంగా పాకిస్తాన్ వచ్చిందంటే దానికి కారణం పాకిస్తాన్ మాజీ ప్రధానే అంటూ విమర్శించాడు. రాజకీయాలు ఎక్కువై.. విధానాలు దారి తప్పడంతోనే ఈ గతి పట్టిందన్నాడు. సెలక్షన్ టీమ్‌లో, మేనేజ్‌మెంట్‌లోకి ఎవరంటే వాళ్లు రావడంతోనే ఇవాళ పాక్ ఇలాంటి స్థితిలో ఉందంటూ నెట్టింట ఓ పెద్ద పోస్ట్ చేశాడు. "పాకిస్తాన్ క్రికెట్ పతనమైందని చెబుతున్నారు. పాక్ ఆటతీరుపై అభిమానుల ఆగ్రహం కూడా సరైనదే. ఒకప్పుడు నెంబర్ వన్ జట్టుగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడెందుకు ఇలా ఉంది. 1990, 1996 వన్డే క్రికెట్‌లో అగ్రస్థానం. 2016లో టెస్టుల్లో టాప్ ర్యాంక్, 2018 టీ20 క్రికెట్‌లో టాప్ ప్లేస్ సాధించింది. 1992 వరల్డ్ కప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టును ఇప్పుడు జింబాబ్వేతో పోల్చుతున్నారా? పాక్ క్రికెట్ పతనం 2019 నుంచే మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. దేశవాళీ క్రికెట్‌ను సమూలంగా మార్చేశారు. డొమెస్టిక్ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేశారు. పాక్‌ను కాదని ఆస్ట్రేలియా హైబ్రిడ్ మోడల్‌ను ప్రవేశపెట్టారు. విదేశీ కోచ్‌ల ఎంపిక, ఇష్టమైన వారిని సెలక్టర్లుగా నియమించడ, మేనేజ్‌మెంట్‌లోకి పాతవారిని తీసుకోవడం. ఇలా ఎన్నో జరిగాయి.. వాటి ప్రభావమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులకు కారణం" అంటూ సేథి భావోద్వేగంతో ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు.