భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి.. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించిన చందంగా ఉంది. ఓవైపు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడంటూనే.. ఇంకోవైపు పదే పదే భారత్ సుంకాల గురించి మాట్లాడుతున్నారు. తాజాగా, భారత్‌కు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న రెండు నిర్ణయాలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్‌ పెట్రోలియం ఉత్పత్తుల రవాణా, అమ్మకాల బ్రోకరింగ్‌ రహస్యంగా నిర్వహిస్తున్నారంటూ 30 మంది వ్యక్తులు, నౌకలు, సంస్థలపైనా అమెరికా ఆర్థిక, విదేశాంగ శాఖలు తాజాగా ఆంక్షలు విధించాయి. ఈ జాబితాలో భారత్‌, చైనాలోని ట్యాంకర్ల ఆపరేటర్లు, మేనేజర్లు, యూఏఈ, హాంకాంగ్‌లోని ఇంధన బ్రోకర్లు, ఇరాన్‌కు చెందిన జాతీయ ఆయిల్‌ కంపెనీ అధినేత కూడా ఉన్నారు. వందల కోట్ల విలువైన ఇరాన్‌కు చెందిన కోట్లాది బ్యారెళ్ల ముడి చమురును ఈ నౌకలు రవాణా చేస్తున్నాయని అమెరికా ఆర్థికశాఖ ఆరోపించింది. ‘ఇరాన్‌ చమురుకు సంబంధించిన కార్యకలాపాలు సాగించే ఎవరికైనా ఆంక్షల ముప్పు తప్పదు’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సంట్‌ స్పష్టం చేశారు. ‘ఇరాన్‌ తరచూ లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేయడానికి రహస్య ట్యాంకర్లు, షిప్పింగ్‌ సంస్థలు, బ్రోకర్లపై ఆధారపడుతోంది.. చమురు అమ్మకాల ద్వారా వచ్చిన నిధులను ఇతర దేశాలను అస్థిరపరిచే చర్యలకు వినియోగిస్తోంది.. ఇరాన్‌ చమురు గొలుసు సరఫరా వ్యవస్థలను దెబ్బతీయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అమెరికా ఉపయోగిస్తోంది. ఎవరైనా ఇరాన్‌తో ఆయిల్‌ డీల్స్ చేస్తే తమ ఆంక్షల పరిధిలోకి వస్తారు’ అని హెచ్చరించారు.అమెరికా ఆంక్షల జాబితాలో భారత్‌కు చెందిన బీఎంఎస్‌ మెరైన్‌, ఆస్టిన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, కాస్మోస్‌ లైన్స్‌ ఇన్క్‌ సంస్థలు ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌, రవాణా, అమ్మకాలను ఇవి రహస్యంగా నిర్వహిస్తున్నాయనేది అమెరికా ప్రధాన ఆరోపణ. దీంతోపాటు భారత్‌కు చెందిన ఫ్లక్స్‌ మారిటైమ్‌ ఎల్‌ఎల్‌పీ..ఓ నౌకకు టెక్నికల్‌ మేనేజర్‌గా వ్యవహరించి, లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఒక దానిని నుంచి మరో దానికి మళ్లించే కార్యకలాపాలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది.అణు ఒప్పందం నుంచి వైదొలగిన తర్వాత ఇరాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా.. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చేలా ఆర్థికశాఖ మంత్రిని ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్‌ సంతకం చేశారు. ఇరాన్‌ చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకుని.. జీరోకు తీసుకురావాలని ఆయన ఆదేశించారు. అణ్వాయుధ దేశంగా ఇరాన్ అభివృద్ధి చెందకూడదని ట్రంప్‌ తేల్చిచెప్పారు. అయితే, అమెరికా కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ ఇంధన ఎగుమతుల ద్వారా ఇరాన్ భారీగా ఆర్జిస్తోంది. 2022లో 54 బిలియన్‌ డాలర్లు(రూ.4.7 లక్షల కోట్లు), 2023లో (53.5 బిలియన్ డాలర్లు) రూ.4.6 లక్షల కోట్లు ఆర్జించినట్టు అమెరికా అంచనా వేసింది.ఇక, దాయాది పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాల నిర్వహణ కోసం 397 మిలియన్ డాలర్లు (రూ.3,461 కోట్లు) నిధులను ట్రంప్ యంత్రాంగం మంజూరు చేసింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విదేశీ సాయాన్ని నిలిపివేసిన ట్రంప్.. పాక్‌కు తాజాగా నిధులు విడుదల చేయడం గమనార్హం. అమెరికా పర్యవేక్షణ కార్యక్రమం కింద ఈ మొత్తాన్ని ఉగ్రవాద నిరోధక చర్యలకు ఉపయోగించాలని, వాటిని భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించకూడదని అగ్రరాజ్యం తేల్చిచెప్పినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కానీ, ఉగ్రవాదం నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోలేదంటూ 2018లో పాక్‌కు ట్రంప్ రక్షణ సాయం నిలిపివేశారు. కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ సర్కారు దానిని ఉప-సంహరించుకుంది. 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల సమయంలో ఎఫ్-16 యుద్ధ విమానాలతోనే దాయాది దాడికి యత్నించింది.