ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో మాజీ మంత్రి కలిశారు. తాను రచించిన ‘ఆది నుంచి నేటి వరకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తాజాగా ఏపీ సీఎంకు కూడా ఆహ్వానం పలికారు. మార్చి 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు నివాసానికి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెళ్లారని.. ఇద్దరి కలయిక జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు తోడల్లుళ్లు.2022లో మాజీ మంత్రి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా.. చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. వీరిద్దరు అప్పుడప్పుడు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో తప్ప బయట పెద్దగా కలిసిన సందర్భాలు లేవనే చెప్పాలి. దీనికి కారణాలు లేకపోలేదు.. 1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇద్దరు తోడల్లుళ్ల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ పరినామాలు మారడంతో దగ్గుబాటి వెంకటేశ్వర్లు, పురంధేశ్వరి దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పురందేశ్వరి 2014 నుంచి 2019 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు.రాష్ట్ర విజభన తర్వాత పరిస్థితి మారిపోయింది.. దీంతో దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో చేరారు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ చెంచురాం మాత్రం 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పర్చూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడారు. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఆయన కుమారుడు హితేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పురంధేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా, రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్నారు. ఇటీవల కాలంలో దగ్గుబాటి, నారా, నందమూరి కుటుంబాలు తరచూ కలుస్తున్నాయి. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా కాలం తర్వాత చంద్రబాబు నివాసానికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.